టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల రాజేందర్..షామీర్ పేటలోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఐదేళ్లుగా టీఆర్ఎస్ తో గ్యాప్ కొనసాగుతోందని…రాష్ట్రం కోసం చాలా అవమానాలు భరించానని…ఇంకా ఆత్మగౌరవాన్ని చంపుకోలేననీ అన్నారు. హరీష్ రావుకు కూడా పలుమార్లు అవమానాలు ఎదురయ్యాయన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లోకి అడుగుపెట్టనివ్వలేదనీ, రెండు సార్లు మమ్మల్ని గేటు దగ్గరే ఆపేశారనీ గుర్తుచేశారు. బానిస కంటే అధ్వానంగా చూస్తూ మంత్రి పదవి ఎందుకని గతంలోనూ ప్రశ్నించానన్నారు..
రాష్ట్రం కోసమే ఇన్నాళ్ళు అవమానాలు భరించామని…అసలు ఆంధ్ర పాలకులు ఇలా చేసిఉంటే తెలంగాణ వొచ్చేదా అని ప్రశ్నించారు.
సీఎంవోలో ఒక్క బిసి,ఎస్సి,ఎస్టీ ఐఏఎస్ లేరన్నది నిజంకాదా అని ఈటల అన్నారు.
సంక్షేమ పథకాలను వ్యతిరేకించానని తనమీద దుష్ప్రచారం చేశారని, కుక్కిన పెనులా వుండట్లేదు కాబట్టే నాపై కక్షకట్టారనీ అన్నారు.
ఆస్థులైనా అమ్ముకుంటాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోబోమన్నారు మాజీమంత్రి.
మంత్రులకు అధికారులకు ప్రభుత్వంలో స్వేచ్ఛేలేదని ఘాటు విమర్శే చేశారు.
నయీమ్ లాంటోడు చంపుతా అని బెదిరించినా బెదరని నేను ఇప్పుడెందుకు భయపడ్తాననీ అన్నారు.
నాడు ఉద్యమసంఘాలను, కులసంఘాలనూ వాడుకున్నారు..ఇప్పుడుమాత్రం వద్దా అని ఎక్కడా పేరు ప్రస్తావించకుండానే పార్టీ అధ్యక్షుడిని నిలదీశారు.
దిక్కు లేని నాడు మమ్ములను మోసిన వాళ్ళు ఇవాళ బయటికి వెళ్లి పోతున్నారని ఆవేదనగా ఉందనీ ఈటల వ్యాఖ్యానించారు.
ఈటల ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేస్తారన్న సమాచారం ముందుగానే అందడంతో నియోజకవర్గంనుంచి ఆయన అనుచరులు వచ్చారు.