హిందీపై రగడ ఆగడం లేదు. ఇక హిందీని వ్యతిరేకించే తమిళనాడులో నాయకులే రోజుకో ప్రకటన చేస్తూ హిందీపై తన నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా తమిళనాడు విద్యాశాఖమంత్రి కె. పొన్ముడి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కోయంబత్తూరులో హిందీ మాట్లాడేవారు పానీపూరీలు అమ్ముతున్నారని..అసలు ఆ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారాయన. దీంతో సద్దుమణుగుతోందన్న వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టైంది.
కోయంబత్తూరులోని భారతియార్ యూనివర్శిటీలో జరిగిన ఒక స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయనీ మాటలన్నారు. “తమిళనాడులో రెండు భాషలు ఉన్నాయి, అవి ఇంగ్లీష్, తమిళం. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష అయితే, తమిళం స్థానిక భాష. హిందీ నేర్చుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయని మాకు చెప్పారు, వచ్చాయా? మీరు వెళ్లి రాష్ట్రంలో, అలాగే కోయంబత్తూరులో పానీ పూరీలు అమ్మే వ్యక్తులు ఎవరో చూడండి” అని అన్నారు. అదే వేదికపై ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా ఉన్నారు.
ఇంగ్లిష్ అంతర్జాతీయ భాష అని… సిఎన్ అన్నాదురై ఇంగ్లీష్, తమిళం కోసం గట్టిగా పోరాటం చేశారని గుర్తుచేస్తూ..అందరం ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాం కదా..ఇతర భాషల అవసరం ఏంటని ఆయన అన్నారు. తమిళనాడు విద్యాసంస్థలు, విద్యార్థులు దేశంలోనే ముందంజలో ఉన్నారని..ఏభాష నేర్చుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారని..అయితే హిందీ ఆప్షనల్ గా మాత్రమే ఉండాలనీ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి మళ్ళీ వివరణ ఇచ్చారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పని లేనందున ఉత్తరాది ప్రజలు దక్షిణాది రాష్ట్రాలకు పని చేసేందుకు వస్తున్నారన్నదే తన వ్యాఖ్యల ఉద్దేశమని చెప్పారు.
తమిళనాడు నుంచి చాలా మంది ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లి పని చేస్తున్నారు. ఆ కోణంలో నేను ప్రకటన చేసాను, ఉత్తరాది నుంచి కూడా వివిధ వ్యక్తులు ఇక్కడకు వచ్చి పని చేస్తారు, ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో పని అందుబాటులో లేదుఅని పొన్ముడి వివరణ ఇచ్చారు.