నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ మూడు గంటలపాటు విచారించింది. విచారణ ముగియగానే అటునుంచి నేరుగా తల్లి దగ్గరకు వెళ్లారు రాహుల్. కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్న సోనియా గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులోనే ఈనెల 8న సోనియా ఈడీ ముందు విచారణకు హాజరుకావల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా విచారణకు రాలేనని మరింత గడువు కావాలని కోరారు కాంగ్రెస్ చీఫ్. దాదాపు 3 గంటల పాటు సాగిన విచారణలో రాహుల్ గాంధీ స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. ఆసంస్థలో తన హోదా ఏంటి? యంగ్ ఇండియన్ సంస్థలో ఎలాంటి సంబంధం ఉంది. ?తన పేరుతో ఆ సంస్థలో షేర్లు ఎందుకు ఉన్నాయి? కాంగ్రెస్ ఎందుకు ఆ సంస్థకు రుణాలు ఇచ్చింది..ఎంత ఇచ్చింది అని ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది.
ఈడీ కార్యాలయంలో విచారణకు రాహుల్ తో పాటు ప్రియాంక వాద్రా కూడా హాజరయ్యారు. రాహుల్కు ఈడీ నోటీసులు, విచారణను నిరసిస్తూ.. కేంద్రం తీరును తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ ‘సత్యాగ్రహ్’ పేరుతో దేశవ్యాప్త నిరసనలకు దిగింది.రాహుల్ పై కేంద్రం కక్షసాధిస్తోందంటూ వందలాది మంది కార్యకర్తలూ రాహుల్ వెంట ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. పార్టీ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం దగ్గర, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ దగ్గర భద్రతా చర్యల్లో భాగంగా అదనపు బలగాలు మోహరించాయి.
రాహుల్ ను విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ పేరుతో చేసిన నిరసన కార్యక్రమాలు పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీశాయి. అరెస్ట్ చేసి తుగ్లక్ రోడ్డులో ఉంచిన కార్యకర్తలను కలిసేందుకు రాహుల్, ప్రియాంక వెళ్లగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తం నెలకొంది. పోలీసుల తీరుపై మండిపడ్డారు ప్రియాంక.