నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈడీ బృందం సోనియాను విచారిస్తోంది… ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.
ఉదయం 11.30 గంటల సమయంలో సోనియా ఢిల్లీలోని తన నివాసం నుంచి బయల్దేరారు. సోనియా వెంట ప్రియాంక గాంధీ ఉన్నారు. సోనియా ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమె వెంట ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతిచ్చింది. కాగా విచారణ గదిలో కాకుండా వేరే గదిలో వేచి ఉండాలని సూచించింది. అనారోగ్యం దృష్ట్యా ఒక మెడికల్ ఆఫీసర్ని కూడా ఈడీ కార్యాలయంలోకి అనుమతించారు. సోనియా లాయర్ కూడా ఆమె వెంట ఉండొచ్చు. కానీ విచారణలో సమయంలో ఆమె పక్కన ఉండరాదని ఈడీ అధికారులు చెప్పారు.
అయితే అప్పటికే అక్కడకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ నిరసనకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బయల్దేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి పొన్నాల, మాజీ ఎంపీ మల్లు రవి, విజయారెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ చేపట్టారు. వీరి నిరసన ర్యాలీ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకూ సాగింది.
కాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న వ్యక్తిని దర్యాప్తు సంస్థలు ప్రశ్నించడం ఇదే తొలిసారి. ఒకవేళ విచారణ సమయంలో సోనియా అలసటకు గురైతే కాస్త విశ్రాంతి తీసుకునేందుకు విరామం ఇస్తామని ఈడీ వర్గాలు వెల్లడించాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని దాదాపు 5 రోజుల్లో 10 గంటలపాటు ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.