డిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసిన మరుసటిరోజే ఈడీ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ముందుంచింది ఈడీ. ఇండో స్పిరిట్స్ లిమిటెడ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రను ఏ1గా చేర్చగా, ఆయన నియంత్రణలో ఉన్న నాలుగు కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చింది. చార్జిషీటు దాదాపు 3 వేల పేజీలు ఉన్నట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రస్తుతానికి సమీర్ మహేంద్రు పాత్రపై దర్యాప్తు పూర్తయిందని, ఇతరులు, ఇతర కంపెనీల పాత్ర, లావాదేవీలపై తదుపరి దర్యాప్తు జరుగుతుందని…త్వరలో అనుబంధ చార్జిషీట్ను దాఖలు చేస్తామని తెలిపారు.అయితే సీబీఐ ఎఫ్ఐఆర్లో ఏ 1గా ఉన్న డిల్లీమంత్రి మనీష్ సిసోడియా పేరు ఇందులో లేదు.శుక్రవారం సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లోనూ సిసోడియా పేరు లేదన్నది తెలిసిందే.
మనీష్ కు సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని స్వాగతించారు డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అదే సమయంలో కేంద్రంపై విరుచుకుపడ్డారాయన. డిప్యూటీ సీఎం మనీష్పై కేసును ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, దీనిపై ఇటీవల సీబీఐ, ఈడీ డైరెక్టర్లను కలిశారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.