నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కొనసాగుతోన్న విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న సీల్ వేసింది. ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఆ ప్రాంగణాన్ని తెరవరాదని ఈడీ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజాగా న్యూఢిల్లీలోని హెరాల్డ్ హౌజ్లో సోదాలు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఆఫీస్కు సీల్ వేసింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించిన అసోషియేట్ జర్నల్స్ లిమిటెడ్ నుంచి యంగ్ ఇండియన్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు గరిష్ట వాటాల ఉన్నాయి. న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయంతో పాటు మరో 11 ప్రాంతాల్లో ఒకరోజు ముందు ఈడీ దాడులు చేసింది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఏజెన్సీ ప్రశ్నించింది.