శ్రీలంకను ఆర్థిక సంక్షోభం అల్లాడిస్తోంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలపొడి మొదలు పెట్రోల్ ధరలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అన్ని నిత్యావసరాలు అమాంతం పెరిగి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది.
ఇక ముడి చమురు నిల్వలు అయిపోవడంతో తన ఏకైక ఇంధన శుద్ధి కర్మాగారంలో ఆదివారం కార్యకలాపాలను నిలిపివేసినట్లు పెట్రోలియం జనరల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు అశోక రన్వాలా తెలిపారు. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 283కు చేరుకోగా, డీజిల్ ధర రూ. 220కి చేరుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 1,359 చేరుకుంది. కాగా, వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూసుకుపోయాయి. గ్యాస్ ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు కిరోసిన్ వాడుతున్నారు.ఇక కోడి గుడ్డు ధర రూ. 35, కిలో చికెన్ రూ. 1000, కిలో ఉల్లి ధర రూ. 600, పాలపొడి ప్యాకెట్ ధర రూ. 250, టీ ధర రూ. 100కు చేరుకున్నాయి.
ఇదిలా ఉండగా.. పెట్రోల్, కిరోసిన్ కోసం క్యూలో నిలుచున్న ఇద్దరు వృద్ధులు చనిపోవడం అక్కడి దయనీయ స్థితికి అద్దంపడుతోంది. చనిపోయిన వాళ్లల్లో 70 ఏళ్ల త్రీవీలర్ డ్రైవర్, డయాబెటిక్ , హార్ట్ పేషెంట్. రెండోవ్యక్తి 72 ఏళ్ల వృద్ధుడు. పెట్రోల్ కోసం క్యూలో నిలబడి కుప్పకూలినట్టు స్థానిక అధికారులు ధ్రువీకరించారు. తీవ్ర విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్న శ్రీలంక వాసులు ఇంధనం కోసం గంటల పాటు పంపుల దగ్గర క్యూలో వేచి చూడాల్సి వస్తోంది.
ఫిబ్రవరి 2022న శ్రీలంక ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం స్థాయిలు వరుసగా 15.1 శాతం మరియు 25.7 శాతం మార్కును తాకాయి. శనివారం నాటికి 400 గ్రాముల పాలపొడి ధర రూ.250కి పెరగడంతో దేశంలోని కొన్ని రెస్టారెంట్లలో కప్పు పాల టీ ధర రూ.100కి చేరింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)