బీజేపీకి ఈసీ ఝలక్.. ప్రధాని మోదీ ఫోటోలు తొలగించాల్సిందే..!
పెట్రోల్ బంకుల వద్ద ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ ఫోటోలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద ప్రధాని ఫోటోలను ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈసీ సంచలన ఆదేశాలను జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్న హోర్డింగులను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 72 గంటల సమాయాన్ని కూడా ఇచ్చింది.
వెస్ట్ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఈసీ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లో ప్రధాని మోదీ ఫోటోలను ప్రచారంగా వాడుకుంటున్నారని.. ఇలా చేయడం ఓటర్లను ప్రభావితం చేయడమేనంటూ టీఎంసీ ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో పెట్రోల్ పంపులతో పాటుగా.. వ్యాక్సినేషన్ డ్రైవ్లో ప్రధాని మోదీ ఫోటోలను 72 గంటల్లో తొలగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.