తెలంగాణ అంతట రాజకీయ భూ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. శాంతి భద్రతలు కాపాడాల్సిన కొందరు పోలీసు అధికారులు … ఆ పని వదిలిపెట్టేసి ప్రతిపక్షాలను వెంటాడి వేధించే పనిలో పడినట్లు తెలుస్తోంది.
ఫోన్ టాపింగ్ కేసు వ్యవహారంలో అప్పటి కీలక అధికారులు వెల్లడిస్తున్న వివరాలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు పోలీసులు విస్తారంగా పనిచేసినట్లు బయటపడింది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల ఫోన్లను ట్యాప్ చేస్తూ సమాచారాన్ని సేకరించేవారు. వీటి ఆధారంగా ప్రతిపక్షాలకు డబ్బులు, పరికరాలు, వనరులు అందించే వ్యాపారవేత్తలను టార్గెట్ చేసేవారు. కాంగ్రెస్ బిజెపి నాయకులకు సంబంధించిన డబ్బును ఎక్కడికి అక్కడ వలవేసి పట్టుకోవడం ఈ పోలీసు విభాగం ముఖ్యపని. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి డబ్బు సజావుగా చూడటం కూడా మరో ముఖ్య విధి.
ఇదంతా ఒకే అయితే జడ్జీల ఫోన్లను కూడా టాప్ చేసినట్లు ఈ కీలక అధికారులు వెల్లడించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్టుల ఫోన్ సమాచారం రాబట్టే వారు. తెలంగాణలో ఉప ఎన్నిక జరిగిన ప్రతిసారి కూడా ఈ టీం ముఖ్యంగా పనిచేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారు,, ఆందోళనలు చేపట్టేవారు,, విద్యార్థి నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది.
పోలీసుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పసిగట్టి ప్రతిపక్ష నాయకులు వాట్సాప్ ఫేస్బుక్ కాల్స్ చేసుకునేవారు. ఈ సమాచారాన్ని రాబట్టేందుకు కూడా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించినట్లు కూడా తెలుస్తోంది.
మొత్తం మీద బీఆర్ఎస్ పెద్దల కనుసన్నల్లోనే ఈ ఆపరేషన్ నడిచింది అని తెలుస్తోంది . ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం తీవ్ర స్థాయిలో పోలీసు విభాగం శ్రమించింది అని లెక్క తేలింది. ఇప్పుడు దీనిమీద తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జోరందుకుంది.