ఆంధ్రప్రదేశ్ కొత్త పోలీస్ బాస్ గా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ క్యాడర్ లో ఉన్న ఐపీఎస్ లందరిలోకి ఆయనే సీనియర్ కావడంతో ఈ పదవిని అప్పగించారు. సీనియార్టీ మాత్రమే కాకుండా చాలా అంశాల్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి పోలీస్ డిజిపి పదవి అధికార పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం. డీజీపీగా సమర్థుడైన అధికారి ఉంటే ప్రభుత్వాన్ని నడపడం తేలిక అవుతుంది. అదే సమయంలో విశ్వసనీయతను కూడా కోరుకుంటారు. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ద్వారకా తిరుమల రావుకి ఈ పదవి లభించింది అనుకోవచ్చు.
గుంటూరు జిల్లాలో చిన్న పల్లెటూరులో జన్మించిన ద్వారకా తిరుమలరావు ప్రభుత్వ పాఠశాల లో చదువుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ లో పీజీ చేసిన తర్వాత గుంటూరు వెళ్లిపోయి కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. ఐపీఎస్ సాధించిన తర్వాత కర్నూలు ఏఎస్పీగా మొదటి పోస్టింగ్ తీసుకున్నారు. ఉత్తర తెలంగాణలో నక్సలైట్ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నప్పుడు కామారెడ్డి,, నిజామాబాద్ అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు వహించారు. తర్వాత కాలంలో అనంతపురం, కడప జిల్లాలకు ఎస్పీగా సేవలు అందించారు రాయలసీమలో విపరీతంగా కొట్లాటలు జరుగుతున్నప్పుడు ఎస్పీగా పనిచేయడం ఆయన కు పేరు తీసుకొచ్చింది. దీంతో పదోన్నతి తర్వాత కూడా అనంతపురం రేంజ్ కు డిఐజిగా బాధ్యతలు అప్పగించారు. నక్సలైట్లను పూర్తిగా తరిమికొట్టాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పుడు ఆ సూచనకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో యాంటీ నక్సలైట్ బలగాలలో మార్పులు జరిగాయి. ఈ క్రమంలో ద్వారకాతిరుమలరావుని ఆక్టోపస్ కు అధిపతిగా నియమించారు. పోలీసు సేవలో టెక్నాలజీని విపరీతంగా వాడుకునే ద్వారకాతిరుమలరావు… సంఘవిద్రోహ శక్తుల్ని గుర్తించడంలో ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో చాలా పేరు ప్రఖ్యాతలు గడించారు. నక్సలైట్లు, తీవ్రవాదుల ఆచూకీ కనిపెట్టడంలో చురుకుగా వ్యవహరించారు. హైదరాబాద్ చుట్టూ లా అండ్ ఆర్డర్ సమస్య పెరుగుతున్నప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. సిటీ పోలీసింగ్ లో భాగంగా సైబరాబాద్ కమిషనర్ గా సమర్థవంతంగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత ద్వారకాతిరుమలరావుని విజయవాడకు రెండో పోలీస్ కమిషనర్ గా నియమించారు. రాష్ట్ర రాజధానిగా పేరు తెచ్చుకున్న విజయవాడలో సమర్థవంతమైన అధికారిగా పేరుగాంచారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నగర కమీషనర్ గా అమరావతి ప్రాంత భద్రతాధికారిగా సేవలందించారు. గత వైసిపి ప్రభుత్వం ఆయన్ని ఆర్టీసీ ఎండీ గా పంపించింది.
భగవద్గీతను బాగా ఇష్టపడే ద్వారకా తిరుమలరావు సన్నిహితులతో క్లోజ్ గా ఉంటారు. పోలీస్ అధికారి కార్యాలయంలో ఆయుధాలు ఉండడం సర్వసాధారణం కానీ ద్వారకా తిరుమలరావు ఛాంబర్ లో మాత్రం పుస్తకాలు విరివిగా కనిపిస్తాయి. కలవడానికి వచ్చిన అతిధులకు కూడా భగవద్గీత పుస్తకాలని బహుకరించడం ఆయన అలవాటు. కర్మ సిద్ధాంతాన్ని బాగా ఇష్టపడే ద్వారకా తిరుమలరావు కి దైవభక్తి బాగా ఎక్కువ. కొత్త పోస్టింగ్ తీసుకున్న ప్రతిసారి దైవ దర్శనం చేసుకోవడం ఆయన అలవాటు.
కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ విభాగం మీద ఆరోపణలు వెళ్లు వెత్తుతున్నాయి. అధికార పార్టీకి లొంగిపోయి పోలీసులు పనిచేస్తున్నారు అని గట్టి టాక్ ఉంది. ఈ పరిస్థితుల్లో ద్వారకా తిరుమలరావు నియామకం సంచలనంగా నిలుస్తోంది. సామర్థ్యం నిజాయితీ తోపాటు విశ్వసనీయతను పరిగణలోకి తీసుకొని ఆయనకు ఈ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.