డీఆర్డీవో మరో ఘనత సాధించింది. మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ గొప్ప విజయం సాధించింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ను కర్ణాటకలోని చిత్రదుర్గ్ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ను పరీక్షించడం ఇదే తొలిసారి. స్టార్టవడం మొదలు…వే పాయింట్ నేవిగేషన్, కిందకుదిగడం వరకు కచ్చితమైన పనితీరు ప్రదర్శిస్తుంది. భవిష్యత్తులో మానవ రహిత విమానాల అభివృద్ధి దిశగా ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానం పని తీరు విషయంలో ఇది గొప్ప మైలురాయని చెబుతున్నారు.
ఈ యూఏవీ (మానవ రహిత గగనతల వాహనం)ను బెంగళూరులోని డీఆర్డీవోకు చెందిన ప్రముఖ పరిశోధక ప్రయోగశాల ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) డిజైన్ చేసి, అభివృద్ధి చేసింది. దీనికి చిన్న, టర్బోఫ్యాన్ ఇంజిన్ను అమర్చారు. దీనికి సంబంధించి…ఎయిర్ఫ్రేమ్, అండర్ క్యారేజ్, ఫ్లయిట్ కంట్రోల్స్, ఏవియానిక్స్ సిస్టమ్లను దేశీయంగానే డెవలప్ చేశారు.
అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ పరీక్ష విజయవంతమైనందుకు డీఆర్డీవోను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. దేశం స్వయం సమృద్ధత సాధించడానికి బాటలుపరచే విజయం ఇదని ఆయన అన్నారు.
https://twitter.com/rajnathsingh/status/1542775678973935617?s=20&t=pJV6O6TBdWMhWUmubLabQg