శాస్త్ర సాంకేతిక రంగాలలో ఒక శకం ముగిసింది. భారత రక్షణ బలగాలకు కొండంత అండగా నిలుస్తున్న అగ్ని మిస్సయిల్స్ రూపకర్త అయిన రామనారాయణ అగర్వాల్ కన్నుమూశారు. సైనిక బలగాలు, శాస్త్రవేత్తలు ఆయన్ను అగ్ని సైంటిస్ట్ గా పిలుచుకుంటారు. రామ్ నారాయణ రూపొందించిన అగ్ని మిస్సైల్స్ ఆ స్థాయిలో భారత సైనిక బలగాలకు అండగా నిలుస్తున్నాయి. అందుచేతనే రామ్ నారాయణ అగర్వాల్ జీవించి ఉన్నంతకాలం ఆయన్ని సైనిక బలగాలు శిఖర స్థాయిలో గౌరవిస్తూ వచ్చాయి.
భూతల క్షిపణితో పాటుగా అన్ని రకాల క్షిపణుల్లో మణిహారంగా భావించే అగ్ని ని రూపొందించడంలో ఆయనది ప్రముఖపాత్ర.
చాలాకాలంగా ఆయన హైదరాబాదులో స్థిరపడ్డారు.
రామ్ నారాయణ్ అగర్వాల్ రాజస్థాన్ లోని జైపూర్లో వ్యాపారుల కుటుంబంలో జన్మించారు. బెంగుళూరులో ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు. అనంతరం సైనిక బలగాన రక్షణ వ్యవస్థలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రోగ్రాం డైరెక్టర్ స్థాయికి వెళ్లారు. 1983లో అగ్ని క్షిపణి కార్యక్రమానికి నాయకత్వం వహించారు. అప్పటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అయిన.. డాక్టర్ అరుణాచలం, డాక్టర్ ఏ.పీ.జె. అబ్దుల్ కలాం లతో కలసి డా. ఆర్.ఎం. అగర్వాల్ పనిచేశారు. హైదరాబాద్ లోని ప్రముఖ పరిశోధనా సంస్థ.. ASL కు వ్యవస్థాపక డైరెక్టర్ గా పనిచేసారు. 2005 లో DRDO లో విశిష్ట శాస్త్ర వేత్తగా పదవీ విరమణ చేశారు . రామ్ నారాయణ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మొదటగా పద్మశ్రీ , ఆ తర్వాత కాలంలో పద్మభూషణ్ అవార్డులు ఇచ్చి గౌరవించింది.ఆ తర్వాత రామ్ నారాయణ్ అగర్వాల్ హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకొని చివరి వరకు రక్షణ రంగానికి సేవలు అందించారు. హైదరాబాద్ నే సొంత ఊరిలో భావించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. చివరగా ఇక్కడే ఆయన కన్నుమూశారు.
అగ్ని క్షిపణుల సృష్టికర్త అయిన రామ్ నారాయణ అంత్యక్రియలు హైదరాబాదులో అధికారిక లాంచనాలతో నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.