ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జ్ఞానవాపి మసీదుపై తీర్పును ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఉల్లంఘనగా అభివర్ణించారు. చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని వేరే మతపరమైన ప్రార్థనా స్థలంగా మార్చకూడదు అని అన్నారు.
కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞాన్వాపి మసీదులో సర్వే కొనసాగుతుందని, మే 17లోగా నివేదిక సమర్పించాలని వారణాసి కోర్టు గురువారం మధ్యాహ్నం చెప్పడంతో ఒవైసి ఈ వ్యాఖ్యలు చేశారు. వారణాసి కోర్టు సర్వే కమిషన్ లో కొత్తగా ఇంకో ఇద్దరు న్యాయవాదులను కూడా చేర్చింది.
బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ఉల్లంఘించిందని అని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోవాలని తాను కోరుకోవడం లేదని ఒవైసీ స్పష్టం చేశారు.
“ఇది కఠోరమైన ఉల్లంఘన. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, అలాగే మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళతాయని నేను ఆశిస్తున్నా. నేను ఒక బాబ్రీ మసీదును కోల్పోయాను.. మరొక మసీదును కోల్పోవాలని నేను కోరుకోను” అని ఆయన అన్నారు.
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టం ప్రకారం మతపరమైన స్థలాల స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నించే వ్యక్తులపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని.. కోర్టులు వారిని దోషులుగా గుర్తిస్తే, వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు” అని సూచించారు.
కమీషనర్ అజయ్ మిశ్రాను తొలగించేందుకు వారణాసి కోర్టు నిరాకరించింది. జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ తనిఖీ కొనసాగుతుందని.. మే 17 వరకు పూర్తి చేయాలని పేర్కొంది.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో కోర్టు నియమించిన కమీషనర్ సర్వే తరువాత, ఈ విషయంపై పక్షపాతంతో వ్యవహరించినందున అక్కడ ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని తొలగించాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దరఖాస్తు దాఖలు చేసింది.