మందిర నిర్మాణానికి “అంబేద్కర్ మహాసభ ట్రస్ట్” వెండి ఇటుక అందజేత.. అందుకే ఇచ్చామంటూ వివరణ
అయోధ్యలో కొలువు దీరుతున్న భవ్య రామ మందిర నిర్మాణానికి దేశ వ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు ట్రస్టు సభ్యులు వెల్లడించారు. తాజాగా రామ మందిర నిర్మాణానికి అంబేద్కర్ మహాసభ ట్రస్టు వెండి ఇటుకను విరాళంగా అందజేసింది. దేశంలో దళితుల నమ్మకం ప్రకారం.. శ్రీ రామ మందిర నిర్మాణానికి వెండి ఇటుకను అందజేశామని.. అంబేద్కర్ మహాసభ ట్రస్టు చైర్మన్ డాక్టర్ లాల్జీ ప్రసాద్ నిర్మల్ తెలిపారు. పద్నాలు సంవత్సరాలు వనవాసం చేసిన శ్రీరాముడు.. ఆదివాసీలతోనే కలిసి ఉన్నారని.. అందుకే తమ వంతుగా రామ మందిర నిర్మాణానికి వెండి ఇటుకను విరాళంగా ఇచ్చినట్లు లాల్జీ ప్రసాద్ వివరించారు.
కాగా, దేశ వ్యాప్తంగా మకర సంక్రాంతి నుంచి నిధి సమర్పణ అభియాన్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 27వ తేదీ వరకు ఈ అభియాన్ కొనసాగనుంది. దేశంలోని ప్రతి హిందూ కుటుంబం నుంచి నిధి సమర్పణ అయ్యేలా చూస్తున్నామని ట్రస్టు సభ్యులు తెలిపారు.