అమెరికాలో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో వాల్స్ట్రీట్ బుధవారం భారీ లాభాల్లో ముగిసింది. ఆ ప్రభావం దేశీయ స్టాక్మార్కెట్లపై కూడా పడింది. 49,868 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10:15 గంటలకు 246 పాయింట్లు లాభపడింది. ఇక, 14,798 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ ఉదయం 10:15 గంటల వరకు 80 పాయింట్ల ఎగబాకింది. జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే, ఎమ్ అండ్ ఎమ్ నష్టాలను చవిచూస్తున్నాయి.
ఇక వరుసగా ఐదో రోజూ తగ్గుతూ వచ్చిన బంగారం ధర… ఏడాది కనిష్ఠ స్థాయికి జారుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో (ఎంసీఎక్స్) జూన్ నెల గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 0.3 శాతం తగ్గి రూ.44,300కు పడిపోయింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన ఆల్టైం గరిష్ఠ స్థాయి రూ.56,000తో పోలిస్తే, ధర 20 శాతం మేర తగ్గింది.
అమెరికా బాండ్ మార్కెట్ రేట్లు పెరుగుతుండటంతోపాటు డాలర్ క్రమంగా పుంజుకుంటుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ప్రస్తుతం 1680 డాలర్ల స్థాయికి పడిపోయింది.