ప్రధాని మోదీ రక్షణ వ్యవస్థలోకి దేశీకుక్కలు చేరాయి. కర్నాటకకు చెందిన ముధోల్ హౌండ్స్ ను ఆ బాధ్యతల్లోకి తీసుకున్నారు. 4 ముధోల్ హౌండ్స్ కుక్కలు కలిస్తే ఒక పులిని వేటాడగలవు. ప్రపంచంలోని హంటింగ్ డాగ్స్ లో ఇవీ ఓ రకం. ఈ వేటకుక్కలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. పెద్ద పెద్ద ఫెన్సింగ్ లను కూడా అవలీలగా దాటగలవు. ఈ జాతి కుక్కలు 72 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి.. 20 నుంచి 22 కిలోల బరువు ఉంటాయి. వాసన పసిగట్టడంలో వీటి ముందు జర్మన్ షెప్పర్డ్ జాతి కుక్కలు కూడా సరితూగవు. ఇప్పుడు ఈ జాగీలాలు ప్రధాని మోదీ రక్షణ భాద్యతలో పాలుపంచుకోనున్నాయి. మోదీని కంటికి రెప్పలా చూసే SPG స్క్వాడ్ లోకి ఇవి ప్రవేశించాయి. దీంతో ముధోల్ హౌండ్స్ దేశ ప్రధాని సెక్యూరిటీ విభాగంలో అవకాశం దక్కించుకున్న మొట్తమొదటి దేశీయ కుక్క జాతిగా నిలిచాయి.
ఈ కర్ణాటక జాతి దేశీయ కుక్కల శిక్షణ ఇప్పటికే ప్రారంభించారు. తమిళనాడుకు చెందిన రాజపాళయం కుక్కల జాతి, అలాగే ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ గ్రేహౌండ్ లను పరీక్షించిన తర్వాత ముధోల్ హౌండ్ లను ప్రధానమంత్రి భద్రతా బృందం ఎంపిక చేసింది.
ముఖ్యంగా ముధోల్ హౌండ్ కుక్కలను రాజుల కాలం నుంచి వేటగాళ్లు ఉపయోగించారు. అలసిపోకుండా ఎక్కువ దూరం పరిగెత్తగల సామర్థ్యం, పసిగట్టే సామర్థ్యం కోసం వారు ఈ జాతికి ప్రాధాన్యత ఇచ్చారు. కర్నాటకలోని ముధోల్ హౌండ్ జాతి కుక్కల జాతి గురించి ప్రధాని మోదీ గతంలో చర్చించారని.. ఈ జాతిని ఇంట్లో పెంచితే భారతీయ జాతికి ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అన్నట్లు అధికారులు తెలిపారు.