శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి గుండెపోటుతో ఆయన మరణించారు. కార్తీకదీపోత్సవంలో విశాఖ వెళ్తూ గుండెపోటుతో కన్నుమూశారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2006లో రిటైర్ అయినప్పటికీ శేషాద్రి సేవలు వినియోగించుకుంటోంది టీటీడీ.
తిరుమల తిరుపతి దేవస్థానంలో 50ఏళ్ల నుంచి స్వామివారి కైంకర్యాలకు సంబంధించి, సేవలకు సంబంధించి, ఉత్సవాలకు సంబంధించి అన్ని వ్యవహారాల్లో ఆయన ప్రమేయం ఉంది. జీవితాంతం శ్రీవారి సేవలో తరించారు శేషాద్రి.
తిరుమలలో1944లో జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. ఆయన పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. శేషాద్రి తిరుమలలో పుట్టి అక్కడే పీజీ వరకు చదివారు. 1978లో టీటీడీలో చేరిన ఆయన.. 2006 జూన్ లో రిటైరయ్యారు. అప్పటి నుంచి ఒఎస్డీగా కొనసాగుతున్నారు. .
స్వామివారి ప్రతిమ ఉన్న డాలర్లను భక్తులకు అందుబాటులో తీసుకువచ్చింది శేషాద్రినే. ఆయన మెడలో ఎప్పుడూ డాలర్ ఉండేది. ఈ కారణాల వల్ల ఆయన పేరు డాలర్ శేషాద్రిగా స్థిరపడిపోయింది. ఇక 2006లో బంగారు డాలర్ల అదృశ్యం ఘటనలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. 305 డాలర్లు మాయమవడంతో శేషాద్రితో పాటు మరో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది టీటీడీ. అయితే డాలర్ల చోరీఘటనలో ఆయన ప్రమేయం లేదన్న కోర్టు ఆదేశంతో మళ్లీ విధుల్లో చేరారు. ఆ పదిహేను నెలల కాలం మాత్రం స్వామివారి సేవలకు దూరమయ్యారు. శేషాద్రి మరణం పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు సంతాపం తెలిపారు. బోర్డుకు ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు.