కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ పి చిదంబరం చేసిన ట్వీట్ ఒకటి, సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ” ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు అంతకంటే తక్కువ మొత్తంలో… దేశంలో 19,25,600 కోట్ల రూపాయల ముద్ర ఋణాలు వచ్చాయి. 50 వేల రూపాయలతో ఎవరైనా ఎలాంటి వ్యాపారం చేసుకుంటారన్నదే నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించే అంశం”. అని చిదంబరం ట్వీట్ చేశారు. నిజమే 50 వేల రూపాయలు స్వల్ప మొత్తమే. కొట్లాది రూపాయల స్కాములు చేసినవారికి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారికి, కోట్లలో ఆదాయాలు కలిగిన వారికి 50వేల రూపాయలు స్వల్ప మొత్తమే. కానీ రోడ్డు పక్కన కూరగాయలు, పండ్లు అమ్ముకునే వాళ్ళకి, చిన్న ప్రొవిజన్స్, ఫ్యాన్సీ దుకాణాలు నడుపుకునే వాళ్ళకి, రోడ్డు పక్కన గంపలలో చేపలు, రొయ్యలు అమ్ముకునే వారికి, చిన్న మెకానిక్ షాప్ నడుపుకునే వారికి, సైకిల్ షాప్, పాన్ షాప్ వంటివి నడుపుకునే వారికి, రోడ్ల ప్రక్కన చిన్న సోడా, కూల్ డ్రింక్ షాపులు నడుపుకునేవారికి, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుకునేవారికి, తోపుడు బండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి, ఐస్ క్రీం బళ్ళు, టిఫిన్ బళ్ళు నడుపుకునేవారికి, పాత సామాను కొని, అమ్ముకునేవారికి ఇలాంటి ఎందరో చిరు వ్యాపారులకు 50,000 అనేది చాలా పెద్ద మొత్తం. వారు ఆ మొత్తంతో తమ దుకాణానికి రోజువారీ అవసరమైన సరుకులను కొనుగోలు చేయగలుగుతారు. ఈరోజు వాటిని అమ్ముకుంటే, రేపటి పెట్టుబడి కోసం వారికి సహజంగా డబ్బులు సమకూరుతాయి. చిదంబరం గారు చెప్పిన లెక్క ప్రకారం తీసుకున్నా దేశంలో 40 కోట్ల మంది ముద్ర ఋణాల లబ్దిదారులున్నారు.
ఈ ముద్ర ఋణాలనేవి లేకపోతే, ఆ 40 కోట్ల మందీ, తమ వ్యాపార, కుటుంబ అవసరాల కోసం అధిక వడ్డీలకు కాల్ మనీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి, వారు ఎండనక వాననక కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన డబ్బులు వడ్డీల రూపంలో చెల్లించి, తమ రోజువారి అవసరాలు తీరక, ఇంట్లో ఎవరికైనా ఏ చిన్న జబ్బు చేసినా, ఏ చిన్న అవసరం వచ్చినా మళ్లీ అదే కాల్ మనీ వారి వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి, మళ్లీ మళ్లీ వడ్డీలు కడుతూ, మళ్లీ మళ్లీ అప్పుడు చేస్తూ… అలాగే కాల్ మనీ కోరల్లో చిక్కి, విలవిల్లాడుతూ, జీవితమంతా అలాగే దారిద్ర్యాన్ననుభవిస్తూ ఉంటారు. అలాంటివారికి తక్కువ వడ్డీతోనో, అసలు వడ్డీ లేకుండానో బ్యాంకులు రుణాలు అందిస్తే… వాటిని వెంటనే చెల్లించాల్సిన ఒత్తిడి కూడా వారి పైన లేకపోతే… అది ఖచ్చితంగా వారికి ఉపయోగపడే అంశమే కదా? వారి వ్యాపార అవసరాలకు, కనీస పెట్టుబడులకు ప్రతిరోజూ వెతుక్కోవాల్సిన అవసరం లేనట్టే కదా? ఈ విషయం…. పాపం కోట్లలో తులతూగే చిదంబరం వంటి వారికి అర్థం కావడం కష్టమే. “అందరూ… మీలాగా, మీ పిల్లల లాగా కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసే పరిస్థితులు ఉండవు చిదంబరం గారూ… సరే ఇంత చెప్తున్న మీరు, మీ హయాంలో పేదల కోసం, వారి వ్యాపార అవసరాల కోసం, విస్తరణ కోసం ఏం చర్యలు తీసుకున్నారో కాసింత వివరిస్తారా?” అని అడుగుతున్నారు కొందరు. అయినా… అనటమెందుకు? అనిపించుకోవటమెందుకు? చిదంబరం సార్? భారత్ మాతాకీ జై.
– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.