ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ల్యాండ్ డీల్ ఎక్కడ జరిగిందో తెలుసా? లండన్ లోనా? పారిస్ లోనా? న్యూయార్క్ లోనా? కాదు, ఇప్పటి వరకూ ప్రపంచ చరిత్రలో అత్యంత ఖరీదైన ల్యాండ్ డీల్ జరిగింది, భూమికి అత్యధిక ధర చెల్లించింది మన భారతదేశంలోనే. అది కూడా పంజాబ్ లోని సర్ హింద్ లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ భూమిని కొనుగోలు చేసిన ఆ గొప్ప వ్యక్తి పేరు దివాన్ తోడర్ మల్.
గురుగోవింద్ సింగ్ కుమారులు బాబా ఫతే సింగ్, బాబా జోరావర్ సింగ్ ల బలిదానం గురించి మీరందరూ ఎక్కడో ఒకచోట, ఏదో ఒక సమయంలో వినే ఉంటారు. ఇక్కడే సర్ హింద్ లోని ఫతేఘర్ సాహిబ్ లో అప్పటి మొఘల్ సైనికుడు వజీర్ ఖాన్, పదేళ్ళ జోరావర్ సింగ్, ఏడేళ్ళ ఫతే సింగ్ లిద్దరినీ చంపాడు. ఆ పసి వాళ్ళిద్దరూ జీవించి ఉండగానే నిలబెట్టి, వారి చుట్టూ ఒక్కొక్క ఇటుకే పేరుస్తూ వారికి సజీవ సమాధి చేశాడు వజీర్ ఖాన్.
ఆ ప్రాంతంలో అత్యంత సంపన్నుడైన దివాన్ తోడర్ మల్, గురుగోవింద్ సింగ్ కుటుంబంపైన అత్యంత భక్తి శ్రద్ధలు కలిగినవాడు. గురుగోవింద్ సింగ్ జీ కుటుంబం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. గురుగోవింద్ సింగ్ కుమారులు, పసివాళ్ళు ఫతే సింగ్, జోరావర్ సింగ్, గురు గోవింద్ సింగ్ తల్లి గజారీ మాతల మృత దేహాలను, వారు బలిదానం చేసి, అమరులైన భూమిని వజీర్ ఖాన్ నుండి కోరాడు. ఆ బాల ధర్మ వీరులకు అంత్యక్రియలు నిర్వహించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. అందుకు ఆ నీచుడు వజీర్ ఖాన్ ఏం కోరాడో తెలుసా? ఆ స్థలం పైన బంగారు నాణాలు పేర్చుకుంటూ వస్తే…. మొత్తం ఎన్ని బంగారు నాణాలు అవుతాయో, అదే ఆ స్థలం విలువ అవుతుందని, అలా బంగారు నాణాలను పేర్చి, ఆ మొత్తాన్ని తనకు చెల్లిస్తే ఆ భూమిని తోడర్ మల్ కు అప్పగిస్తానని వజీర్ ఖాన్ నిస్సిగ్గుగా చెప్పాడు.
తోడర్ మల్ అందుకు అంగీకరించి, తన యావదాస్తిని అమ్మి, ఆ మొత్తం సొమ్మును బంగారు నాణాలుగా మార్చి, ఆ నేలపై ఒక్కొక్క నాణాన్ని పేర్చడానికి ఉద్యుక్తుడవుతున్న తరుణంలో, వజీర్ ఖాన్ మరింతగా తన అత్యాశను, దుష్ట బుద్ధిని ప్రకటించాడు. ఆ నాణాలను ఒకదాని పక్కన ఒకటి నిలువుగా పేర్చాల్సిందిగా తోడర్ మల్ ను ఆదేశించాడు. అలాగైతే మరిన్ని ఎక్కువ నాణాలు వస్తాయనేది వాడి దుర్మార్గపు ఆలోచన. వజీర్ ఖాన్ చెప్పినట్లుగా నాణాలను పేర్చుకుంటూ వస్తే…. ఆ నాలుగు చదరపు అడుగుల స్థలంలో మొత్తం 78,000 బంగారు నాణాలు పట్టాయి. ఆ రోజుల్లోనే వాటి విలువ 250 కోట్లు. ఇదే ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకూ అత్యంత ఖరీదైన, అత్యంత తక్కువ విస్తీర్ణం కలిగిన భూమి. కానీ తన గురు పుత్రుల అంత్యక్రియలను ఆ స్థలంలో నిర్వహించడానికి తోడర్ మల్ తన యావదాస్తిని అమ్మి ఆ భూమిని కొన్నాడు. ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకూ ఇలాంటి త్యాగం చేసిన వారెవరూ లేరు. అంత పెద్ద మొత్తానికి, అంత చిన్న స్థలాన్ని కొనుగోలు చేసిన వారూ లేరు. అక్కడ ఫతే సింగ్, జొరావార్ సింగ్ ల స్మృత్యర్థం నిర్మించిన భవనాన్ని జహాజ్ హవేలీ లేదా జహాజ్ మహల్ అంటారు. ఈ హవేలీ ఇప్పుడు, ఫతేఘర్ సాహిబ్ నుండి కేవలం 1 కి.మీ దూరంలో ఉన్న సర్ హింద్-రూప్నగర్ రైల్వే లైన్ కు తూర్పు వైపున ఉండే హర్నామ్ నగర్ లో ఉంది. ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం మరియు INTACH సహకారంతో, ఈ ప్రదేశాన్ని SGPC స్వాధీనం చేసుకుని పునరుద్ధరిస్తోంది. భారత్ మాతాకీ జై.
– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.