వైశాఖ మాసంలో శుక్లపక్షం మూడో రోజు అంటే తదియ రోజు ని అక్షయ తృతీయ అని పిలుస్తారు . అక్షయము అంటే క్షయములేని ఫలితాలు ఇచ్చే రోజన్నమాట . అయితే ఇటీవల కాలంలో అక్షయ తృతీయ అంటే బంగారం కొనుగోలు చేసేందుకు మంచి రోజు అని మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది. బంగారం కొనేందుకు అక్షయ తృతీయ ను గుర్తుపెట్టుకోవడంలో తప్పులేదు కానీ అంతకుమించి అక్షయ తృతీయ రోజు కొన్ని మంచి పనులు చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారికి పూజ చేసి కుంకుమను అందరికీ పంచాలి. అక్షయ తృతీయ మండు వేసవిలో వస్తుంది కాబట్టి చల్లటి కుండ, గొడుగు, చెప్పులు, దుస్తులు వంటివి దానం చేయడం మంచిది అని చెప్తారు. ఇందుకు కారణం లేకపోలేదు అక్షయ తృతీయ రోజు చాలా విశేషమైన సంఘటనలు జరిగాయి. అవేంటో తెలుసుకుందాం.
🙏అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత🙏
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5.వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు వనవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం
అక్షయ తృతీయనాడు జ్ఞానాన్ని సంపాదించడం, దానాలను చేయడం వల్ల, మామూలు దినములకన్నా, అనేకరెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, కాబట్టి అక్షయ తృతీయ రోజు చేసే పూజ దానం వంటివి విశేష ఫలితాలు ఇస్తాయని పెద్దలు చెబుతున్నారు.