యూపీ సీఎం యోగీపై ప్రశంసల జల్లు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. యోగీ నాయకత్వంలో యూపీ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. రాష్ట్రంలోని సుపరిపాలన, అభివృద్ధి, ప్రజాస్వామిక ప్రమాణాలే గెలుపును నిర్దేశిస్తాయని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్ నుంచి కొందరు సీనియర్లు బయటకు వెళ్లడం వల్ల తమకేం ఇబ్బంది లేదని హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అభ్యర్థులను మార్చడం, నాయకుల జంపింగ్ లు ఎన్నికల ప్రజాస్వామ్యంలో సాధారణం ఆయన అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
యోగీ హయాంలో యూపీకి 30 మెడికల్ కాలేజీలు వచ్చాయని.. ప్రతి జిల్లాకు ఒకటి ఉండేలా చూస్తున్నారు. రాష్ట్రంలో రెండు AIIMS ఉండగా, జపనీస్ ఎన్సెఫాలిటిస్ పరిశోధనా కేంద్రం కూడా ఉంది. 10 కొత్త విశ్వవిద్యాలయాలు, 77 కొత్త కళాశాలలు వచ్చాయి. యూపీ అంతటా లక్షా 40 వేల కాలేజీలను పునర్నిర్మించిందని అన్నారు.
2017 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లామని… అఖిలేష్ యాదవ్ పాలనపై ఎంతో నిరసన, వ్యతిరేకతకు తోడు అప్పుడు మోడీ వేవ్ తోడైందని గుర్తు చేసిన షా… ఐదేళ్ల తరువాత ఇప్పుడు యోగీ ఉత్తరప్రదేశ్ బ్రాండ్ అయ్యారన్నారు. మోదీ, యోగీ డబుల్ ఇంజిన్ సర్కారు సాధించిన ప్రగతి గురించి వివరిస్తూ ఈసారి తమ బలం మరింత పెరిగిందని…ఐదేళ్లలో యూపీకి ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే మరోసారి బీజేపీకే యూపీ ప్రజలు ప్రజలు పట్టంగట్టబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక కుల ప్రభావం ఎక్కువగా ఉండే యూపీలో ఈసారి అన్ని కులాల్ని హిందుత్వ గొడుగు కిందకు తెచ్చేలా మాస్టర్ ప్లాన్ తో వెళ్తోంది బీజేపీ. బిజెపి తన ఎన్నికల ర్యాలీలలో “జాతి ధర్మ్ సే ఉత్ కర్ బదయా హై సమ్మాన్, సబ్సే పెహ్లే గరీబ్ కళ్యాణ్” అని నినాదాలు వినిపించాయి. అయితే ఓబీసీల్లో చీలికపైనా వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి ఏ కుల సంఘం కూడా బీజేపీకి దూరం జరగలేదని…. కేవలం కొందరు నేతలు మాత్రమే వెళ్లిపోయారనీ అన్నారు. ఉద్యోగ ఉపాధి రంగాల్లో అభివృద్ధినీ ప్రస్తావించారు.
ఉద్యోగ రంగానికి సంబంధించిన వివాదాస్పద సమస్యపై అమిత్ షా… ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఉపాధిగా భావించే కమ్యూనిస్టుల మాదిరిగా ఉద్యోగ రంగాన్ని చూడవద్దని. ఉద్యోగాలకు, ఉపాధికి తేడా ఉందని అన్నారు.
ఉపాధి పరిస్థితిని మెరుగుపరిచాం… ప్రజలు ఉద్యోగాల గురించి మాట్లాడుకోవడం సహజం. కానీ వాటికి తేడాను అర్థం చేసుకోవాలి. స్టార్టప్ లు, ఇ మార్కెటింగ్ అవకాశాల్ని మెరుగుపరిచామని అన్నారు.
సమాజ్ వాదీ పార్టీపై మోదీ చేసిన వ్యాఖ్యలపై అడగ్గా… తాను ఏ పార్టీనీ దేశ వ్యతిరేకి అనబోమని… కానీ పార్టీ అయినా నాయకులు అయినా దేశ వ్యతిరేకులకు మద్దతిస్తే వారి కుట్రను బయటపెడ్తామని అన్నారు. ఏదైనా ప్రభుత్వం ఉగ్రవాదులపై కేసులు ఉపసంహరిస్తే అది దేశ వ్యతిరేకం అవుతుందని అఖిలేశ్ ను ఉద్దేశించి అన్నారు అమిత్ షా.
ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్న యోగీ… పాలకుడిగా రాణించారని మెచ్చుకున్నారు. శాంతిభద్రతలు యూపీలో మెరుగుపడ్డాయని.. నేరాలు అదుపులోకి వచ్చాయనీ అన్నారు. పాలన నుంచి మౌలిక సదుపాయాలు, సంక్షేమం వరకు 2017లో ఇచ్చిన హామీల్లో 92 శాతం హామీలు నెరవేర్చినట్టు చెప్పారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)