రైతుల ఉసురు పోసుకోవద్దు సారూ
ఒకేరోజు మూడు యూటర్న్ లు తీసుకున్న సీఎంగా కెసిఆర్ చరిత్ర సృష్టించడం మనందరికీ తెలిసిందే. నియంత్రిత సాగు పేరుతో నియంత రాచరికం చెలాయించిన తర్వాత, విమర్శల వెల్లు కారణంగా తత్వం బోధ పడినట్టుంది. ఆ పద్ధతికి టాటా చెప్పారు. రైతులు ఎక్కడైనా ధాన్యం అమ్ముకోవచ్చని చెప్పారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలను నిన్నటి వరకూ వ్యతిరేకించి, బంద్ చేయించి, ఇప్పుడు వాటినే సమర్థించేలా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామనడం దారుణం. అలా చేయాలని ఏ చట్టంలో కూడా లేదు. మోడీ చట్టం వల్లే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతులను భ్రమింపచేయడం అనే కుట్ర ఇందులో ఉందా అనేది కొందరి సందేహం. నియంత్రిత సాగు పేరుతో రైతుల చేతికి సంకెళ్లు వేసినంత పని చేశారు. చెప్పిన పంటే వేయాలని హుకుం జారీ చేశారు. దానికి రైతు బంధుకు లంకెపెట్టి ఒత్తిడి తెచ్చారు.
సన్నరకం వరి మాత్రమే పండించాలని మరోసారి కెసిఆర్ రైతుల ఉసురు పోసుకున్నారు. సీఎం మాట నమ్మి దారుణంగా నష్టపోయిన రైతును పట్టించుకునే దిక్కు లేదు. క్వింటాలుకు వందో వందా యాభయ్యో అధికంగా ఇస్తామని దుబ్బాక ఎన్నికకు ముందు చెప్పిన కెసిఆర్ ఆ తర్వాత అది మర్చిపోయినట్టున్నారు. రైతులు రోడ్డెక్కినా డోంట్ కేర్ అంటున్నారు. అక్టోబర్లో వరదలకు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమాను కెసిఆర్ సర్కార్ అమలు చేసి ఉంటే వరద బాధిత రైతులకు పరిహారం అందేది. జరిగిన నష్టాన్ని లెక్కలు కట్టి మరీ పరిహారం అందే అవకాశం ఉండేది. పోనీ కెసిఆర్ ప్రభుత్వమైనా పరిహారం ఇచ్చిందా అంటే అదీ లేదు. బల్దియా ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో ఇంటికి పదివేల పరిహారం ప్రకటించారు. గ్రామాల్లోని రైతులతో ఇప్పుడు పనిలేదు కదా అన్నట్టు పంట నష్ట పరిహారం ఊసే ఎత్తలేదు.
రైతులకు కెసిఆర్ సర్కార్ చేస్తున్న నష్టం ఇంతటితో ఆగలేదు. తెలంగాణలో ఇప్పటికీ దాదాపు 5 లక్షల మంది రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అందటం లేదు. వాళ్ల దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ప్రాసెస్ చేయడంలో జాప్యం చేస్తున్నది. దీంతో వాళ్లకు ఏడాదికి 6 వేల రూపాయలు అందడం లేదు. కేంద్ర డబ్బులు ఇస్తుంటే కెసిఆర్ అడ్డుపడే అవసరం ఏముంది? మోడీకి ఏమాత్రం ప్రచారం జరగొద్దనే పంతం ఎందుకు? మరో విషయం. సామాన్యులకు సర్కారు దవాఖానాల్లో సరైన వైద్యం అందక పోతే ప్రయివేటు వైద్యం చేయించుకోవడానికి మోడీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం తెచ్చింది దేశంలో ఇప్పటికే కోట్ల మంది ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. వారిలో రైతులు కూడా ఉన్నారు. తెలంగాణలో మాత్రం ఆ అవకాశం లేదు. ఆరోగ్యశ్రీ ఉందికదా అంటున్నారు. కానీ కరోనా వైరస్ ను అందులో చేర్చలేదు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయల జీవితబీమా ఇచ్చే పథకం తెలంగాణలో అమలవుతున్నది. రైతుకు జబ్బు చేస్తే చనిపోకుండా ప్రాణాలు కాపాడుకోవడానికి మెరుగైన వైద్యం కోసం ఆయుష్మన్ భారత్ ను అమలు చేస్తే తప్పేంటి? కుటుంబానికి జీవిత బీమా కంటే రైతు బతికుండటమే ముఖ్యం కదా? ఇలా పదే పదే పలు విషయాల్లో రైతుల ఉసురు పోసుకోకండి సారూ అని ముఖ్యమంత్రిని రైతు నేతలు, ప్రతిపక్ష నాయకులు, మేధావులు కోరుతున్నారు.