భారతీయ విద్యార్థులకు కీలక సూచన చేశాయి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ). ఉన్నత విద్య కోసం పాకిస్తాన్ వెళ్లొద్దని సూచించాయి. ఇక్కడ చదువుకుంటున్న వాళ్లు కానీ, విదేశాల్లో ఉంటున్న విద్యార్థులు కానీ ఉన్నతవిద్య కోసం పాకిస్తాన్ కు వెళ్లవద్దంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
పాకిస్తాన్లో డిగ్రీ చదివిన వాళ్లు భారత్ లో ఉద్యోగాలకు, ఉన్నత విద్య పూర్తి చేసేందుకు అర్హులు కాదని స్పష్టం చేశాయి.అయితే పాక్ నుంచి శరణార్థులుగా వచ్చి భారత పౌరసత్వం పొందిన వారికి మాత్రం మినహాయింపు ఇచ్చాయి.
అంతేకాదు… పాకిస్థాన్లో డిగ్రీ పొంది భారత దేశానికి వలస వచ్చినవారు, వారి పిల్లలకు ఈ నోటిఫికేషన్ నుంచీ మినహాయింపు ఉంది. అయితే అందుకు హోం మంత్రిత్వ శాఖ నుంచి ముందుగా అనుమతి పొందవలసి ఉంటుంది.
ఇటీవలే ఉన్నతవిద్యకోసం భారతీయ విద్యార్థులు చైనా వెళ్లవద్దనీ ఈ రెండు సంస్థలు సూచించిన సంగతి తెలిసిందే. చైనాలోని విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ చదువుతున్న భారతీయ విద్యార్థులకు వీసాలను జారీ చేసేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ సలహా ఇచ్చింది. అయితే పాకిస్థాన్ విషయంలో జారీ చేసిన తాజా నోటిఫికేషన్ వెనుక కారణాలపై స్పష్టత రావల్సి ఉంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)