వివాదాస్పద జ్ఞానవాపి నిర్మాణంపై కొనసాగుతున్న కేసులో ముస్లిం పక్షం వివాదాస్పద స్థలం యొక్క వీడియో సర్వేను బహిర్గతం చేయవద్దని మే 27న కోర్టును కోరింది. కోర్టు నియమించిన కమిషనర్ సర్వే రిపోర్ట్ రిజల్ట్స్ కాపీని హిందూ, ముస్లిం పక్షాలకు మే 30న అందజేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో మసీదుకు సంబంధించిన పబ్లిక్ సర్వేలో వీడియోలోని వివరాలను బహిరంగంగా పేర్కొనవద్దని ముస్లిం పక్షం కోర్టును కోరింది.
వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో ఉన్నది శివలింగమని హిందూపక్షం,కాదు ఫౌంటెన్ అని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి.
సర్వే రిపోర్ట్, వీడియోగ్రఫీ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హిందూ, ముస్లిం పక్షాల ప్రతినిధులు కోర్టు విచారణకు హాజరయ్యారు. 11 గంటల పూర్తి సర్వేలో జ్ఞానవాపి మసీదులో ఆలయానికి సంబంధించిన అనేక ఆధారాలు లభించాయని హిందూ పక్షం పేర్కొంది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. సర్వే రిపోర్ట్, వీడియోగ్రఫీ రిపోర్టులను మే 30న ఇరువర్గాలకు అందజేస్తామని తీర్పునిచ్చింది.
అయితే సర్వేకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పబ్లిక్గా రాకుండా చూడాలని జ్ఞానవాపి మసీదు కమిటీ కోర్టును అభ్యర్థించింది. మరోవైపు కోర్టు నిర్ణయాన్ని హిందూ పక్షం స్వాగతించింది. నివేదిక కాపీని పొందిన తర్వాత తమ అభ్యంతరాలను తెలియజేయడానికి ఇరుపక్షాలకు 7 రోజుల గడువు ఉంటుంది.
జ్ఞానవాపిలో వివాదాస్పద నిర్మాణంపై చర్చ సందర్భంగా, హిందువుల తరపు న్యాయవాది విష్ణు జైన్.. ఫౌంటెన్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు ముస్లిం పక్షం ఉద్దేశపూర్వకంగా శివలింగాన్ని అపవిత్రం చేసిందని ఆరోపించారు. ఫౌంటెన్ నిర్మాణంలా కనిపించేలా శివలింగానికి 63 సెంటీమీటర్ల రంధ్రం వేశారని ఆయన ఆగ్రహం వ్యక్త చేశారు. ఆరోపించిన నిర్మాణం ఇప్పటికీ గదిలో ఉందని, ముస్లిం పక్షం దానిని తొలగించడానికి ప్రయత్నించిందని, అయితే CRPF వారిని ఆపిందని జైన్ చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ 30 మే 2022న జరుగుతుంది.