భారతీయ కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఉన్న తమ ఓట్లను ఇతర పార్టీలకు ధారాదత్తం చేయడానికి, త్యాగాలు చేయడానికే పూర్తిగా సిద్ధపడ్డారా? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గతంలో పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళలలో అధికారంలో ఉండిన కమ్యూనిస్టు పార్టీ, నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కేంద్రంలో ఏర్పడిన కిచిడీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీ, దేశంలోని మీడియా, సినిమా, విద్య, సాహిత్యం, ప్రింటింగ్ వంటి పలు రంగాలలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు కేవలం కేరళకే పరిమితమైంది. బీహార్, తమిళనాడులలో అధికార పక్షాలకు తమ మద్దతునిస్తోంది. ఆ మధ్య మాహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో ఏర్పడిన కిచిడీ ప్రభుత్వానికి కూడా కమ్యూనిస్టులు మద్దతుగా నిలిచారు. దశాబ్దాలపాటు త్రిపురను ఏలిన కమ్యూనిస్టులు ఇప్పుడు రెండు దఫాలుగా ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా మీడియా, సినిమా, సాహిత్యం వంటి రంగాలలో ఇప్పటికీ వారి ఆధిపత్యమే కొనసాగుతోంది.
1977 నుంచి 2011 వరకు బెంగాల్ ను కమ్యూనిస్టులు అప్రతిహతంగా పరిపాలించారు. 2011 లో మమతా బెనర్జీ దూకుడుతో కమ్యూనిస్టుల పాలనకు బ్రేక్ పడింది. అప్పటినుంచి, అంతకుముందు కూడా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడులలో అనేకమంది కమ్యూనిస్టు కార్యకర్తలు మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. దాంతో బెంగాల్లో కమ్యూనిస్టుల బలం గణనీయంగా తగ్గింది. అదే సమయంలో బెంగాల్లో మమతా బెనర్జీని ఢీకొనడం ద్వారా బిజెపి బాగా బలం పుంజుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికి బిజెపి మమతా బెనర్జీకి బలమైన ప్రత్యర్థిగా మారింది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలిచే పరిస్థితి ఏర్పడిందేమో అన్నట్లుగా వాతావరణం నిర్మాణమైంది. అంతే అప్పటివరకూ తృణమూల్ కాంగ్రెస్ తో పోరు సలిపి, తమ కార్యకర్తల ప్రాణాలను కోల్పోయి, ఎంతోమంది కార్యకర్తల కాళ్లు, చేతులు, కళ్ళు పోగొట్టుకున్న కమ్యూనిస్టు పార్టీ ప్రాధాన్యం మారిపోయింది. ఇప్పుడు వారి ఏకైక లక్ష్యం బిజెపి గెలుపును అడ్డుకోవడం. దాంతో కమ్యూనిస్టులు తమ ఓట్లన్నీ తృణమూల్ కాంగ్రెస్ కే గంపగుత్తగా గుద్దేశారు.35 ఏళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన కమ్యూనిస్టులు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ కూడా దాదాపు ఇదే వైఖరి అవలంబించింది. తన ఓట్లను తన రాజకీయ ప్రత్యర్థి అయిన తృణమూల్ కాంగ్రెస్ కు బదలాయించి, బిజెపి ఓటమి చెందిందని చంకలు గుద్దుకుని ఆనంద పడిపోయింది.
మొన్న తెలంగాణలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలలో కూడా కమ్యూనిస్టులు తమ ఓటును TRS కు బదలాయించి, బిజెపిని ఓడించామని మురిసిపోయారు. ఆ విషయాన్ని వాళ్లు బహిరంగంగా ప్రకటించారు కూడా. ఇక ఆంధ్రప్రదేశ్లో జరిగిన నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో సైతం తమ ఓట్లను తెలుగుదేశానికి బదలాయించి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానాలలో తెలుగుదేశం విజయానికి ఇతోధికంగా సాయం చేశారు కమ్యూనిస్టులు. ఎన్నో ఏండ్లుగా తమ అభ్యర్థే విజయం సాధిస్తూ వచ్చిన తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో సైతం వారు మూడవ స్థానానికి పడిపోవడమే దానికి తార్కాణం. ఎందుకంటే సైదాంతిక పునాదులు ఉన్న పార్టీలకు సంబంధించిన ఓటర్లు సహజంగా షిఫ్ట్ కారు. గెలుపోటములతో సంబంధం లేకుండా వాళ్లు తమ పార్టీలకే ఓట్లు వేసుకుంటారు. తమ తమ పార్టీల నుంచి ఈ విధమైన వ్యూహాత్మక సూచనలు అందితే తప్ప వాళ్లు తమ ఓటును వేరే పార్టీకి బదలాయించారు. ఇక్కడ అదే జరిగింది. కమ్యూనిస్టు ఓట్ అంతా వ్యూహాత్మకంగా తెలుగుదేశానికి బదిలీ అయింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అందుకే రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలలోనూ తెలుగుదేశం విజయం సాధించగలిగింది.
ఇక కేరళలోనూ భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేరళలో మాత్రమే కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రత్యర్థులుగా ఉన్నారు. మిగిలిన రాష్ట్రాలన్నింటిలో దాదాపు కలిసి పోయారు. ఇక ఇప్పుడు కేరళలోని ముస్లింలు, కమ్యూనిస్టుల దౌర్జన్యాల కారణంగా కేరళ క్రైస్తవులు క్రమక్రమంగా కమ్యూనిస్టులకు దూరమవుతూ ఉన్నారు. ముఖ్యంగా ముస్లింల లవ్ జిహాద్ కారణంగా క్రైస్తవ యువతులకు ఏర్పడుతున్న ముప్పును అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం లైట్ తీసుకుంటూ ఉండడం, లవ్ జిహాద్ కారణంగా కేరళ క్రైస్తవ యువతులు ముస్లిం యువకుల ఉచ్చులో చిక్కుకుంటూ ఉండడం, ఇస్లామిక్ తీవ్రవాదం వైపు మరలుతూ ఉండడాన్ని కేరళ క్రైస్తవులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ విధంగా ఇప్పుడు వారు కమ్యూనిస్టులకు దూరమై బిజెపికి చేరువవుతున్నారు. సో…. క్రైస్తవుల దన్నుతో కేరళలో బిజెపి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో బిజెపిని అడ్డుకోవడానికి సమీప భవిష్యత్తులో కేరళలోని కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏకమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విధంగా కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా నెమ్మది నెమ్మదిగా తమ ప్రాభవాన్ని కోల్పోతూ ఎక్కడో చోట, ఎవరితో ఒకరితో జట్టు కట్టి తమ రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తం మీద ఈ పరిణామాలు కమ్యూనిస్టులను ఏ తీరానికి చేరుస్తాయో చూద్దాం. భారత్ మాతాకీ జై.
– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి,