మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంచి మనసు చాటుకున్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో దీపావళి జరుపుకున్నారు. కరోనా రక్కసి కారణంగా అనాథలైన ఆ చిన్నారులందరినీ భోపాల్ లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. సతీసమేతంగా వారిని సాదరంగా ఆహ్వానించారు. వారితో కలిసి దీపాలు వెలిగించి.. సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చౌహాన్ సైతం వారితో కలిసి ఆడిపాడారు. సీఎం సతీమణి సాధనాసింగ్ సైతం వారితో కలిసి పాటలు పాడారు. సీఎంవో వెల్లడించిన వివరాల ప్రకారం 305 మంది చిన్నారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనాథ చిన్నారులతో సీఎం దంపతులు గడపడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది దీపావళి వేడుకలకు, రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా కూడా సీఎం వారందరినీ అధికారిక నివాసానికి ఆహ్వానించి సంబరాలు చేసుకున్నారు.