ఆదానీ వ్యవహారాలపై నిలదీసినందునే కేంద్రప్రభుత్వం తన లోక్ సభ సభ్యత్వంపై వేటు వేసిందని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాజా వ్యవహారంపై డిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇలాంటి నిర్ణయాలు తన స్థైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. తనను జైల్లో పెట్టినా అక్కడినుంచి కూడా మోదీని ప్రశ్నిస్తానన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని చాలాసార్లు చెప్పానని… ఇప్పుడు జరుగుతున్నది అదేనని రాహుల్ అన్నారు. తాను సావర్కార్ ను కానని గాంధీని అని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దేశమంటే ఆదానీ, ఆదానీ అంటే దేశం అన్నట్టు తయారు చేశారని, ఆదానీ గురించి మాట్లాడిన ఆ రోజు మోదీ కళ్లల్లో భయాన్ని తాను చూశానని రాహుల్ వ్యాఖ్యానించారు.అనర్హతపై న్యాయపోరాటం చేస్తానన్న రాహుల్ గాంధీ…తనకు మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.