నూతన పార్లమెంట్ భవనంపై ప్రధాని మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై వివాదం రేగుతున్న వేళ….అప్పట్లో రాజ్యాంగ ప్రతిపై దానికి రూపకల్పన చేసిన శిల్పుల బృందంలో ఒకరైన దీనానాథ్ భార్గవ కుటుంబం స్పందించింది. చిత్రానికి, శిల్పానికి మధ్య కాస్త వ్యత్యాసం ఉండడం సహజమేకదా అని వారంటున్నారు. దీనానాథ్ భార్గవ డిసెంబర్ 24, 2016లో ఇండోర్లో తుది శ్వాస విడిచారు.
జాతీయ చిహ్నంలోని సింహాలకు రూపకల్పన చేసే ముందు కోల్కత్తాలోని ఒక జూకువెళ్లి మరీ సింహాలను పరిశీలించారట దీనానాథ్. ఒక్కరోజు కాదు..ఏకంగా మూడు నెలలపాటు పరిశీలించి దాన్ని రూపకల్పన చేశారట.
అసలైతే రాజ్యాంగప్రతిలోని జాతీయ చిహ్నాన్ని రూపొందించే బాధ్యతను నాటి ప్రధాని నెహ్రూ… రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ ప్రిన్సిపల్, ప్రసిద్ధ చిత్రకారుడైన నందలాలా బోస్ కు అప్పగించారు. అందులోనే ఆర్ట్స్ చదువుతున్న దీనానాథ్ కు బోస్ ఆ బాధ్యత అప్పగించారు. గురువు ఆదేశానుసారం ఆయన రోజూ కోల్ కతాలోని జూకు వెళ్లి అందులోని సింహాన్ని పరిశీలించేవారు.భర్త అంకింతభావాన్ని ఆయన భార్య ప్రభ పదేపదే గుర్తు చేసుకునేవారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అప్పటికి భార్గవ వయసు 21 ఏళ్లు. అసలు చిహ్నానికి తాను 1980లో తయారు చేసిన నకలు కూడా ఇప్పుడు ఆ ఇంట్లో ఉంది.