సర్జకల్ స్ట్రైక్స్ పై పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రక్షణ దళాలను తాము నమ్ముతామని…సర్జికల్ స్ట్రైక్స్ పై తమ వైఖరి స్పష్టమనీ అన్నారు. రాహుల్ జోడోయాత్ర సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ…నియంత్రణ రేఖ (LOC) వెంబడి 2016లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో జరిగిన పుల్వామా దాడులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మోదీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు.చాలా మందిని చంపేశామంటారని, కానీ అందుకు రుజువులు మాత్రం చూపించరని అన్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ పరిపాలన సాగిస్తున్నారనీ దిగ్విజయ్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. నరేంద్ర మోదీపై ద్వేషంతో రక్షణ దళాలను కాంగ్రెస్ అవమానిస్తోందని దుయ్యబట్టింది.కాంగ్రెస్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ను ప్రశ్నిస్తోందని, ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడుల విషయంలో కూడా దిగ్విజయ సింగ్ భారత దేశాన్ని నిందించారని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు.