వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార పార్టీ టీఎంసీని టార్గెట్ చేస్తూ బీజేపీ ప్రచారాన్ని వేడెక్కిస్తోంది. ఈ సారి ఎలాగైనా మమతా సర్కార్ను కూల్చేసి.. కమలం జెండాను రెపరెపలాడించాలని తహతహలాడుతోంది. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ క్రమంలో దీదీపై బీజేపీ అగ్రనేతలు కూడా ఫైర్ అవుతున్నారు. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. తాజాగా సోమవారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు. రాణీబంధ్లో జరిగిన ఓ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందిగ్రామ్లో జరిగిన సంఘటనపై స్పందిస్తూ.. మమతా బెనర్జీకి స్మూత్ పంచ్ ఇచ్చారు. తన హెలికాప్టర్లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో ప్రయాణం కాస్త ఆలస్యమైందని.. దీంతో ర్యాలీలో చేరడం కూడా ఆలస్యమైందన్నారు. దీనిని నేను కుట్రగా భావించాలా..? అంటూ అమిత్ షా ప్రశ్నించారు. నందిగ్రామ్లో మమతపై దాడి జరిగిందనడం కూడా ఇలాంటిదేనని.. ఎన్నికల కమిషన్ కూడా మమతపై దాడి జరగలేదని తేల్చి చెప్పిందని అమిత్ షా అన్నారు. మమతా బెనర్జీ పాలనో 130 మంది రాజకీయ కుట్రలో హత్యగావించబడ్డారని.. వారి కుటుంబ సభ్యులకు ఎంత బాధ బాధపడుతున్నారో మీకు తెలుసా..? అంటూ దీదీని టార్గెట్ చేస్తూ ప్రశ్నించారు. మీ కాలికి తగిలిన గాయం తర్వాత మీకు నొప్పి అంటే ఏంటో తెలిసిందా..?అని షా విమర్శలు గుప్పించారు. కాగా, నందిగ్రామ్లో నామినేషన్ వేసిన అనంతరం మమతా బెనర్జీ గాయపడ్డ విషయం తెలిసిందే.అయితే తనపై ఎవరో నలుగురు వ్యక్తులు దాడి చేశారంటూ ఆరోపించారు. అయితే ఈసీ మాత్రం దీదీ మాటలను కొట్టిపారేసింది.