వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మొత్తం 8 దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి రెండు దశల పోలింగ్ ముగియగా.. ఇంకా 6 విడతలుగా జరగనున్నాయి. అయితే అధికార టీఎంసీకి, బీజేపీకి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బోణీ కొడదామనుకుంటున్న ఎంఐఎం పార్టీపై కూడా అధికార టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు.. స్వయంగా అధినేత్రి మమతా బెనర్జీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఓవైసీ బీజేపీ ఏజెంట్ అంటూ ఆరోపిస్తూ.. బెంగాల్ ప్రజలు ఆయన పార్టీని తిరస్కరించాలంటూ కోరారు. బీజేపీ డబ్బులు ఇస్తే.. హైదరాబాద్ నుంచి బెంగాల్కు ఓ వ్యక్తి వచ్చాడంటూ ఓవైసీని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కుచ్బెహార్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి కూడా తానే ఖచ్చితంగా గెలిచి తీరుతానంటూ ధీమా వ్యక్తం చేశారు.