వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాతకం మే తర్వాత ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పేశారు. వెస్ట్ బెంగాల్లో త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారం ప్రారంభించేసింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 200 స్థానాలకు పైగా గెలుచుకోబోతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మే నెల తర్వాత మమతా బెనర్జీ బెంగాల్ సీఎం పదవి నుంచి తొలిగిపోబోతున్నారని జోస్యం చెప్పారు. బెంగాల్ ప్రజలకు టీఎంసీ ఏమీ చేయలేదని.. కేంద్ర ప్రవేశ పెట్టిన పథకాలను కూడా దీదీ సర్కార్ నీరుగార్చిందని ఆరోపించారు. కుచ్బెహార్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే.. దీదీ సర్కార్ నిలిపివేసిన సొమ్మును రైతుల అకౌంట్లలో వేస్తామన్నారు. జైశ్రీరాం అని నినదిస్తే కూడా బెంగాల్ రాష్ట్రంలో నేరంగా భావించే పరిస్థితి నెలకొందని వాపోయారు. జై శ్రీరాం అని భారత దేశంలో కాకుండా పాకిస్తాన్లో నినదించాలా అంటూ ప్రశ్నించారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో బీజేపీకి చెందిన కార్యకర్తలను టీఎంసీ గుండాలు మట్టుబెడుతున్నారని.. ప్రజలు ఇక్కడ భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారని అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసే సమయానికి మమతా బెనర్జీ కూడా జై శ్రీరాం అని నినదిస్తారని మరో జోస్యం కూడా చెప్పుకొచ్చారు అమిత్ షా.