టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆమె పోటీ చేస్తున్న నందిగ్రామ్లో గెలవడం అన్నది అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. బీజేపీ నుంచి పోటీలో ఉన్న సువేందు అధికారికి నందిగ్రామ్లో మంచిపట్టు ఉంది. అంతేకాదు.. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే ప్రాంతం నుంచి పదవులు చేపడుతుండటంతో టీఎంసీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. అంతేకాదు.. పలుమార్లు మమతా బెనర్జీ కూడా నేను గాడిదను.. వారు (సువేందు కుటుంబం) రాజకీయంగా మోసం చేసిందంటూ స్వయంగా మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. వారు ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెడుతారని.. గెలుపే వారి లక్ష్యమని బహిరంగ సభల్లో మాట్లాడటంతో టీఎంసీ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. మరోవైపు ఎన్నికల ప్రచారం చివరి రోజు హోమంత్రి అమిత్ షా భారీ రోడ్ షో నిర్వహించడం.. అదే రోజు మమతా బెనర్జీకి బీజేపీ కార్యకర్తలు మధ్యలో ఎదురైతే.. జై శ్రీరాం అంటూ నినాదాలు చేయడం జరిగింది. వరుస సంఘటనలు చూసిన టీఎంసీ శ్రేణులు కూడా సువేందుకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలోనే మమతా బెనర్జీ తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. సడన్గా ఎన్నికలకు ఒక రోజు ఉందనగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, శరద్ పవార్, ఎంకే స్టాలిన్, తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ థాకరే, అరవింద్ కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్ సహా దేశంలోని ఇతర బీజేపీయేతర పార్టీలన్నిటికీ బహిరంగ లేఖ రాశారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని కోరారు. టీఎంసీ చైర్పర్సన్గా బీజేపీకి వ్యతిరేకంగా జరగబోయే యుద్ధంలో.. తాను కూడా పనిచేస్తానంటూ పేర్కొన్నారు. అయితే నందిగ్రామ్లో కాంగ్రెస్తో పాటు.. ఇతర పార్టీల ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకే ఈ లేఖ రాశారని.. బీజేపీయేతర పార్టీల సానుభూతి పరులంతా ఏకపక్షంగా మమతా బెనర్జీకి ఓటేస్తారన్న ఆశతోనే ఇలాంటి లేఖ విడుదల చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.