అతనేమో ఉగ్రవాది. కొన్ని దశాబ్దాల పాటు భారతదేశంతో పోరాడాడు. కానీ అతను పెళ్లాడింది మాత్రం భారత ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ఓ బ్యూరోక్రాట్ ను. అవును నిజం..కశ్మీరీ హిందువుల ఊచకోతకు సూత్రధారి, పాత్రధారి కూడా అయిన ఫరూఖ్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే పెళ్లాడింది ఓ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ అధికారిని. వాళ్ల మధ్య ఎంత గొప్ప అండర్ స్టాండింగ్ అంటే..అతని భార్యగా గర్విస్తానని చెప్పుకుంటుంది అస్సాబా.
1990లలో లోయలో కాశ్మీరీ హిందువుల సామూహిక హత్యలకు కారణమైన ఉగ్రవాది బిట్టా కరాటే…. 2011లో కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (KAS) అధికారి అస్సాబా అర్జుమాంద్ ఖాన్ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ 2008లో ఓ స్నేహితుడింట్లో కలుసుకున్నారు. తరువాత ఐదు నెలలకు బిట్టా ఆమెకు ప్రపోజ్ చేశాడు. మొదట సంకోచించినా తరువాత అంగీకరించింది అస్సాబా. ఏడాది తరువాత ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారు. కానీ ఆమె కుటుంబం అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే పెద్దవాళ్లను ఎదిరించిందామె. జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కి చెందిన , దశాబ్దాలుగా భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసిన ఫరూఖ్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే అలా భారత ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ఓ బ్యూరోక్రాట్ ను పెళ్లాడాడన్నమాట.
1999లో యూనివర్శిటీ ఆఫ్ కాశ్మీర్ నుండి మాస్ కమ్యూనికేషన్ ,జర్నలిజంలో MA పట్టా పొందిన అస్సాబా ఖాన్, 2007 వరకు అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎడిటర్గా పనిచేశారు. 2009లో, ఖాన్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (KAS) పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తరువాత సాధారణ పరిపాలనా విభాగంలో పోస్టింగ్ వచ్చింది. ఆమె అలా ఒక్కో కోర్సు చదువుతూ ఉద్యోగాలు చేస్తుంటే ఫరూఖ్ మాత్రం పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థల ఆదేశంతో అమాయక పౌరులు, భద్రతా సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా చంపుతూ దేశంపై యుద్ధంచేస్తూ వచ్చాడు. 1990లో కశ్మీరీ హిందువుల మారణహోమంలో అరెస్టయ్యాడు. 17 ఏళ్ళ తరువాత విడుదలయ్యాడు. 2008లో అమర్నాథ్ భూవివాదం కేసులో మరోసారీ అరెస్టయ్యాడు. అప్పుడు 8నెలల తరువాత జైలు నుంచి బయటకొచ్చాడు. టెర్రర్ ఫండింగ్ ఆరోపణలపై 2019లో మళ్లీ అతనికి శిక్షపడింది. అలాంటి తీవ్రవాదిని తమ కూతురు పెళ్లాడడం అస్సాబా కన్నవాళ్లకు ఇష్టంలేదు. కానీ పట్టుబట్టి అతన్ని చేసుకుందామె.
90 ల ప్రారంభంలో లోయలో సాయుధ పోరాటం తారస్థాయికి చేరింది. చాలా మంది ముస్లిం యువతులు మిలిటెంట్లను ఇష్టపడేవారు. గ్రామల్లోకి వచ్చినప్పుడు వారికి సాదరస్వాగతం పలికేవారు. వారికి అందుతున్న గౌరవ మర్యాదలే అమ్మాయిలు వాళ్లను ఇష్టపడేందుకు కారణం. అయితే ఆశ్చర్యకరంగా మిలిటెంట్లను వ్యతిరేకించాల్సిన ప్రభుత్వ ఉద్యోగి అస్సాబా మాత్రం అతన్ని కోరుకుంది. అయితే వాళ్లు మొదటిసారి కలిసినప్పుడు ఆమె KAS అర్హత పొందలేదు. కానీ కశ్మీర్ ఉన్నతాధికారి అయ్యాకనే బిట్టాను పెళ్లాడింది అస్సాబా. 2009లో కేఏఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 2011లో ఉగ్రవాదిని పెళ్లాడింది. ఓ వేర్పాటువాదిని పెళ్లాడానని బంధుమిత్రులు ఆందోళన చెందారు. కానీ నేను అదేం ఆలోచించలేదు. బిట్టా నా భర్త అయినందుకు గర్వపడుతానంది పలు సందర్భాల్లో మిసెస్ బిట్టా. 2021 డిసెంబర్ నాటికి 48 ఏళ్ల అస్సాబా కశ్మీర్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టరేట్ గా పనిచేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)