తెలంగాణ రైతులకు మద్దతుగా ఢిల్లీ వేదికగా కేంద్రంతో ఢీఅంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్లో నిరసనదీక్షకు దిగారు. ధాన్యం సేకరణలో దేశమంతా ఒకే విధానం ఉండాలనే ప్రధాన డిమాండ్ తో ఆయన దీక్ష చేస్తున్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలూ దీక్షలో పాల్గొన్నారు. రైతు నాయకులు రాకేశ్ తియాకత్ కూడా కేసీఆర్ కు సంఘీభావంగా కేసీఆర్ తో దీక్షావేదికపై కూర్చున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు కేసీఆర్. కేంద్రం రైతులతో పెట్టుకుంటోందని…అన్నదాతతో గొడవ మంచిది కాదని హితవుపలికారు. తెలంగాణలో పండించే ధాన్యాన్ని కేంద్రమే కొనాలని కొనుగోళ్ల విషయంలో ఒకే విధానాన్ని అవలంభించాలని డిమాండ్ చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న తెలంగాణ సీఎం… కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని ఆయన అన్నారని…మేమేం ఆయన్ని అడుక్కోవడం లేదని వ్యాఖ్యానించారు. ఆయన పీయూష్ గోయల్ కాదని పీయూష్ గోల్ మాల్ అని అన్నారు. తెలంగాణ నుంచి కేబినెట్లో ఉన్న మంత్రి కిషన్ రెడ్డిపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం మొత్తం తామే కొంటామని కిషన్ రెడ్డి అన్నమాట నిజం కాదా అని నిలదీశారు. నేను రైతుల కోసం ఢిల్లీ వచ్చి ఆందోళన చేస్తుంటే…రైతులను రెచ్చగొడుతూ వచ్చిన రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం హైదరాబాద్లో దీక్షలు చేస్తున్నారని…ఎందుకు వారు అక్కడ దీక్ష చేస్తున్నారో ఎవరికీ తెలయడం లేదని కేసీఆర్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ నిస్సిగ్గుగా, నియంతగా వ్యవహరిస్తోందన్న కేసీఆర్…ఎవరన్నా ఎదురుతిరిగితే…కేంద్ర సంస్థలతో దాడులుచేస్తోందని మండిపడ్డారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)