తమిళనాడులో రూట్ మార్చ్ నిర్వహించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం అనుమతివ్వడంతో ఆర్ఎస్ఎస్ పనిలో పడింది. ఏప్రిల్ 16న రూట్ మార్చ్ నిర్వహించనున్నట్టు సంస్థ తెలిపింది. మొత్తం 45 చోట్ల మార్చ్ నిర్వ హణకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. అసలైతే ఆర్ఎస్ఎస్ మార్చ్ లకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుపై తమిళనాడు సర్కారు అప్పీల్ కు వెళ్లగా సుప్రీం తిరస్కరించింది.
సుప్రీం ఆదేశాల కాపీతో డీజీపీ శైలేంద్రబాబును ఆర్ఎస్ఎస్ ముఖ్యులు కలిశారు. కొన్ని నిబంధనలు పాటించాలంటూ…షరతులతో అనుమతి మంజూరు చేస్తున్నట్టు డీజీపీ వారికి తెలిపారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించే కవాతుకు బందోబస్తు కల్పించాలని జిల్లాల ఎస్పీలనూ డీజీపీ ఆదేశించారు. ఏప్రిల్ 16న అరణి, అంబోర్, వెల్లూరు, చెన్నై, హోసూర్, అత్తూరు, సేలం, కరూర్, పళని, మదురై, తిరుచ్చి, పట్టుకోట్టై, పల్లడం సహా 45 చోట్ల రూట్ మార్చ్ నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమైంది.మార్చ్ లకు అవసరమైన బందోబస్తు కల్పించేందుకు సిద్ధమని ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగం ప్రకటించింది.
తమిళనాడు వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సంఘ్ రూట్ మార్చ్ లు జరుగుతుంటాయని..అయితే కేవలం తమిళనాడులో మాత్రమే అనుమతి నిరాకరించారని సంస్థ ముఖ్యులు అన్నారు. గతంలోనూ తమ కవాతుకు అనుమతివ్వాలని హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని గుర్తు చేశారు.