ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లో భద్రతను పటిష్టం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి నిర్ణయం తీసుకొన్నాయి. కేంద్రం నుంచి ఇందుకు సంబంధించి ప్రత్యేక సంకేతాలు వస్తున్నాయి. పొరుగు దేశం పాకిస్థాన్ అదే పనిగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో…సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పెంచుతున్నారు. ఈ క్రమంలో తిరుమలలో భద్రతను పటిష్టం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి.
కేంద్రం ఆదేశాల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ప్రత్యేకంగా తిరుమల పంపించారు. పోలీసు ఉన్నతాధికారులు, భద్రతా నిపుణులతో కలిసి .. డీజీపీ హరీష్ స్వయంగా అక్కడ భద్రతా వ్యవహారాలను సమీక్ష చేశారు. అనంతరం తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలన్న అంశంపై టీటీడీ ఈవో జె. శ్యామల రావు సమక్షంలో శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉన్నత స్థాయి భద్రత సమావేశం నిర్వహించారు. ముందుగా తిరుపతి ఎస్పీ, టీటీడీ ఇన్ ఛార్జ్ సీవీఎస్వో హర్షవర్ధన్ రాజు భద్రతా అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. పోలీసు అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోంగార్డు, సివిల్ పోలీసు, టీటీడీ సెక్యూరిటీతోపాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని డిజిపి సూచించారు. అలిపిరి వద్ద బహుళ స్థాయి వాహన తనిఖీ వ్యవస్థ, డిఫెన్స్ ఏజెన్సీలతో కలసి సెన్సార్ ప్లే సిస్టమ్, ఆధునిక భద్రతా పరికరాలు, సైబర్ భద్రత వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా ఆయన చర్చించారు.
టీటీడీ ఈవో జె.శ్యామల రావు మాట్లాడుతూ, భద్రతపై అనుబంధ ఏజెన్సీలతో ఒక సమన్వయ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. తిరుమలలో సైబర్ భద్రతా వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలని సూచించారు. విస్తృతస్థాయిలో తిరుమల భద్రతా సమీక్ష నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుమల కు చేరుకొనే దారులపై గట్టి నిఘా ఉంచుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయ పడ్డారు. తిరుపతి నగరంలో కూడా ఉగ్రవాదుల కదలికల మీద ఒక కన్నేసి ఉంచాలని సూచించారు. ఇందుకోసం తిరుమల తిరుపతి పోలీసు ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలని అభిప్రాయ పడ్డారు.