నోయిడాలోని ట్విన్ టవర్ల కూల్చివేత రేపే. దేశంలోనే మొదటిసారి బృహత్ భవనాల కూల్చివేతను చూడాలని స్థానికులే కాదు దేశం మొత్తం ఆసక్తిగా ఉన్నారు. నోయిడాలోని సెక్టార్ 93లో సూపర్ టెక్ సంస్థ వీటిని నిర్మించింది. వాటిలో ఒక భవనం ఎత్తు 108 మీటర్లు ఉండగా.. మరో భవనం ఎత్తు 97 మీటర్లు.అయితే నిబంధనలు ఉల్లంఘించి నిర్మించారని తేలడంతో నేలమట్టం చేయాలని సుప్రీం కోర్టు ఢిల్లీ నగరపాలక సంస్థను ఆదేశించింది.
40 అంతస్థుల ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో వాటిని నేలమట్టం చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ జంట భవనాల సముదాయాన్ని పేలుడుపదార్థాలతో ధ్వంసం చేయనున్నారు. ట్విన్ టవర్స్ ను కూల్చాలని చాలాకాలం క్రితమే ఆదేశాలు ఇచ్చినా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రేపు ఈ ఆకాశహర్మ్యాలు పూర్తిగా నేలమట్టం కానున్నాయి. ఈ మేరకు అన్ని అంతస్థుల్లో పేలుడు పదార్థాలు అమర్చారు. డైనమైట్, ఎమల్షన్స్, ప్లాస్టిక్ పదార్థాలు కలగలిసిన 3,700 కేజీల పేలుడు పదార్థాలను భవంతులను అమర్చారు. వందమీటర్ల దూరంలో ఉన్న ఒక్క బటన్ ను నొక్కడం ద్వారా ట్విన్ టవర్లు పేకమేడల్లా కూలిపోనున్నాయి. చేతన్ దత్తా అనే బ్లాస్టర్ స్విచ్ నొక్కి.. ఈ భవనాలను కూల్చివేయనున్నారు.
915 ఫ్లాట్లున్న ఈ భవంతుల విలువ 12 వందల కోట్లు. 633 ఫ్లాట్లు ఇప్పటికే బుక్కయ్యాయి. 180 కోట్లను సూపర్ టెక్ సంస్థ కేటాయించింది. అయితే వారు చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని…12 శాతం వడ్డీని కలిపి మరీ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆ సంస్థను ఆదేశించింది.
అయితే కోట్లు పెట్టిన ఈ టవర్స్ ను కూల్చేందుకూ కోట్లే అవుతున్నాయి. కూల్చివేత కోసం 20 కోట్లు వెచ్చిస్తున్నారు. ఆ ఖర్చులో 5 కోట్లను నిర్మాణ సంస్థ సూపర్ టెక్ చెల్లిస్తుండగా మిగిలిన డబ్బును భవన వ్యర్థాలను విక్రయించడం ద్వారా సమీకరిస్తారు. కూల్చివేతతో 55వేల టన్నుల వ్యర్థాలు వస్తే…అందులో నాలుగువేల టన్నులకు పైగా స్టీల్ ఉంటుందని చెబుతున్నారు.
ఎడిపైస్ అనే సంస్థ ట్విన్ టవర్స్ ను కూల్చేందుకు ఒప్పందం చేసుకుంది. అందుకు సంస్థ 100 కోట్ల బీమాకూడా చెల్లించింది. పరిసర ప్రాంతాల్లో ఏదైనా నష్టం సంభవిస్తే వారికి పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.
వ్యర్థాల ఏరివేతకు కనీసం మూడు నెలలు పడుతుందంటున్నారు. పక్కన ఉండే నివాసాలకు ఎలాంటి నష్టం కలగకుండా… ఉన్న స్థలంలోనే కుప్పకూలేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదంతా నిపుణుల పర్యవేక్షణలో జరగనుంది.