పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ను తగ్గించేందుకు నిరాకరించింది డిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం. దీంతో వాహనదారులే కాదు, ఇంధన డీలర్లూ ఇబ్బంది పడుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, యూపీల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలుచేస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఇంధన కొనుగోళ్లు గణనీయంగా పడిపోయాయి.
దీంతో డిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమబాట పట్టాలని నిర్ణయించింది. తమ రాష్ట్రంలోనూ వ్యాట్ తగ్గించాలని కోరుతూ అసోసియేషన్ అధ్యక్షుడు అనురాగ్ నరైన్ సీఎం కేజ్రీవాల్ కు లేఖ రాశారు. చుట్టుపక్కనే ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే డిల్లీలో ధర చాలా ఎక్కువ ఉందని…అందువల్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని వాపోయారు. అధిక వ్యాట్ తమపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని…పెట్రోల్ అమ్మకాలు రాష్ట్రానికి ఆదాయం తీసుకురాలేక అధిగమించలేని నష్టం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. వ్యాట్ తగ్గింపుతో అమ్మకాలు పెరిగితే ఆర్థిక సంక్షోభాన్ని నివారించవచ్చనీ అన్నారు. డిల్లీ పరిధిలో దాదాపు 50 శాతం అమ్మకాలు తగ్గాయి.
ప్రస్తుతం డిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 104 రూపాయలుంటే నోయిడాలో 95 రూపాయలు, గుర్గావ్ లో 96 రూపాయలుంది. దేశంలోని చాలా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయని డిల్లీ తగ్గించకుంటే రాజకీయంగానూ ఇబ్బంది తప్పదని డీలర్లు హెచ్చరిస్తున్నారు.