పార్లమెంటు సమావేశాల మొదటి రోజు తెలుగు వెలుగులు విరజిమ్మాయి. విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అచ్చమైన తెలుగు సాంప్రదాయంలో నిలిచారు. పదవి స్వీకార ప్రమాణం చేసేందుకు తెలుగు పంచ కట్టు లాల్చీతో ఆయన బయలుదేరారు. పార్లమెంటు సభ్యుల ప్రాంగణం దగ్గర కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని, వాళ్ల శుభాకాంక్షలతో దైవ పూజ చేసి బయలుదేరారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తైన సైకిల్ మీద ప్రయాణం చేస్తూ పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు. ఢిల్లీ వీధుల్లో పంచకట్టుతో పచ్చ సైకిల్ తొక్కుతూ కలిశెట్టి ప్రయాణం చేస్తుంటే అంత అబ్బురంగా చూశారు. తెలుగు సాంప్రదాయం ఔన్నత్యాన్ని ఢిల్లీ వీధుల్లో ఆయన చాటి చెప్పారు.
ఉత్తరాంధ్రకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడు కి మొదటినుంచి తెలుగు భాష సంస్కృతి అంటే బాగా ఇష్టం. ప్రముఖ దినపత్రిక ఈనాడులో జర్నలిస్టుగా పనిచేస్తూ చాలామందికి పరిచయం అయ్యారు. వ్యాపార రంగంలో నిలదొక్కుకున్నాక రాజకీయాల వైపు వెళ్లారు. తెలుగుదేశం పార్టీని, పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ని విపరీతంగా ప్రేమించడం అలవాటు. సుమారు 20 సంవత్సరాలుగా పార్టీలో విపరీతంగా కష్టపడ్డారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పసుపు రంగు జెండా మోస్తూ ఉత్తరాంధ్రలో అందరికీ చిరపరిచితులు. తెలుగుదేశం మానవ వనరుల విభాగం తరఫున ఉత్తరాంధ్రలో కార్యకర్తలకు విస్తారంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. శిక్షణ శిబిరాల నిర్వహణలో కూడా తెలుగుదనానికి పెద్దపీట వేసేవారు.
తెలుగు పండగలను బాగా పాటించడం కలిశెట్టి అప్పలనాయుడు కి అలవాటు. కలిశెట్టి కుటుంబ సభ్యుల్ని సంక్రాంతి సమయంలో సొంత ఊరికి ఆయన పిలిపిస్తూ ఉంటారు. సుమారు 100 కుటుంబాలకు పైగా ఎక్కడెక్కడో స్థిరపడిన కలిశెట్టి కుటుంబీకులు… స్వగ్రామానికి సంక్రాంతి సమయంలో తరలివస్తారు. అచ్చమైన తెలుగు పిండి వంటలతో సంప్రదాయకంగా భోజనాలు పెట్టి గౌరవించి పంపించడం కలిశెట్టి అప్పలనాయుడు కి అలవాటు. సంవత్సరం పొడవునా ఎంతమంది ఇంటికి వచ్చినా ,, వండి వడ్డించి పంపించడం ఆయన శ్రీమతి కి అలవాటు.
ఢిల్లీ పార్లమెంటు ప్రాంగణంలో కూడా తెలుగు పంచ కట్టు, తెలుగు సైకిల్ తో ఆయన సందడి చేశారు. పార్లమెంట్లో కూడా తెలుగు భాషలోనే ప్రమాణ స్వీకారం చేసి కలిశెట్టి అప్పలనాయుడు అందర్నీ ఆకట్టుకున్నారు.