
File Photo
ఢిల్లీ మద్యం కేసులో తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్ లో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చింది ఈడీ. కవిత పేరుతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ డాక్టర్ శరద్ చంద్రారెడ్డి పేర్లు ఉన్నాయి. ఆ కేసులో అరెస్టైన సమీర్ మహేంద్రు కేసులో ఈ చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో గతంలోనే అరెస్టైన బోయినపల్లి అభిషేక్, బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై పాత్రలనూ ఈడీ అందులో ప్రస్తావించింది. ఇంతకుముందు అరెస్టైన విజయ్ నాయర్, అభిషేక్ నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా ఈ చార్జిషీట్ వేసింది ఈడీ.
సమీర్ మహేంద్రు కంపెనీలో కవిత 32 శాతం వాటా కలిగి ఉన్నట్లు ఇందులో ఈడీ పేర్కొంది. ఒబెరాయ్ హోటల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి ఏర్పాటు చేసిన మీటింగ్ లో పలుమార్లు కవిత, అరుణ్ పిళ్లై, అమిత్ అరోరా పాల్గొన్నారని తెలిపింది.
ఇండో స్పిరిట్స్లో ఎల్1 కింద ఇచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. కవిత మార్చిన 10 ఫోన్ల వివరాలను కూడా ఇందులో ఈడీ పొందుపర్చింది. సౌత్ గ్రూప్, ఆప్ నేతల మధ్య జరిగిన డీల్తో పాటు కవిత, రాఘవ్ రెడ్డి అసలు భాగస్వాములుగా ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థ వ్యవహారాలను ఈడీ పొందుపర్చింది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్లోని కవిత ఇంట్లో జరిగిన సమావేశంలో సమీర్ మహేంద్రు, అరుణ్ పిళ్లై, అభిషేక్, కవిత భర్త అనిల్ పాల్గొన్నట్లు ఈడీ దగ్గర ఆధారాలు సైతం ఉన్నాయి.
మూడు పేజీల ఈ ఛార్జిషీట్ను నవంబర్ 26న రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ దాఖలు చేసింది. అయితే తాజాగా ఆ ఛార్జిషీట్ను సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించడం, ఆధారాలు సమర్పించాల్సిందిగా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు తాజా చార్జిషీట్లోనూ ఆమె పేరు ఉండడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
గతంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులోనూ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. 10 ఫోన్లను మార్చినట్లు గుర్తించడం, సౌత్ గ్రూప్ లావాదేవీలను ఛార్జిషీట్లో ఈడీ పొందుపర్చింది. దీని ఆధారంగానే కవితకు సీబీఐ నోటీసులిచ్చింది, ప్రశ్నించింది. ఢిల్లీనుంచి వచ్చిన అధికారులు ఆమెను దాదాపు ఏడున్నరగంటల పాటు ప్రశ్నించారు.