ఢిల్లీ ప్రైవేట్ విద్యుత్తు పంపిణీ కంపెనీల బోర్డు పదవుల్లో ఉన్న ఆప్ నేతలను తొలగించి, ప్రభుత్వ ఉన్నతాధికారులను నియమించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా. ఆయా కంపెనీలతో కుమ్మక్కై, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని ఆరోపణలు వచ్చాయి. ప్రైవేట్ విద్యుత్తు పంపిణీ కంపెనీల్లో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. ప్రభుత్వ, ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం వీటిలో ప్రభుత్వ ఉన్నతాధికారులను నియమిస్తూ ఉంటారు. కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఈ డిస్కమ్లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులను డిస్కమ్లలో నియమిస్తున్నారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆప్ నేతలను వీటిలో నియమించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి జాస్మిన్ షా, ఆ పార్టీ ఎంపీ ఎన్డీ గుప్తా కుమారుడు నవీన్ గుప్తాలను ఈ కంపెనీల బోర్డుల్లో నియమించింది. వీరు ఆయా కంపెనీల ప్రతినిధులతో కుమ్మక్కయి, ప్రభుత్వ ఖజానాకు రూ.8,468 కోట్ల మేరకు నష్టం కలిగించారని స్పష్టమైందని ఢిల్లీ ఎల్జీ సక్సేనా చెప్తున్నారు.