జహంగీర్పురి హింసాత్మక ఘటనలో ఐదుగురు నిందితులను ఢిల్లీ కోర్టు ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. మరో నలుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఐదుగురు నిందితులు- అన్సార్, సలీం, దిల్షాద్, సోనూ, అహిర్లపై జాతీయ భద్రతా చట్టంకింద కేసులు పెట్టారు. శనివారం మొత్తం తొమ్మిది మంది నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోహిణి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ అంశం చాలా సున్నితమైనదని, కుట్రలో ప్రమేయం ఉన్న ఇతర నిందితులను గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు చేయాల్సి ఉందని క్రైమ్ బ్రాంచ్ కోర్టుకు తెలిపింది.
మరోవంక, ప్రధాన నిందితుడు అన్సర్ షేక్తో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కేసులు నమోదు చేసింది. పోలీసులు నమోదు చేసే ఎఫ్ఐఆర్తో సమానమైన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్)ను ఇడి దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) లోని వివిధ క్రిమినల్ సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపింది. దర్యాప్తు చేపట్టాల్సిందిగా కోరుతూ ఇటీవలే ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ అస్తానా ఇడి డైరెక్టర్ సంజరు కుమార్ మిశ్రాకు లేఖ రాశారు.
వాయువ్య ఢిల్లీలోని జహంగీర్పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. పోలీసులు ఐదుగురు నిందితులపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపారు.ఇప్పటివరకు 25 మంది అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లున్నారు.