అత్యంత కాలుష్య రాజధానుల జాబితాలో మరోసారి మొదటిస్థానంలో నిలిచింది ఢిల్లీ. స్విస్ పొల్యూషన్ టెక్నాలజీ కంపెనీ ‘ఐక్యూ ఎయిర్’ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం వరుసగా నాలుగో సారి మొదటి స్థానంలో ఉంది డిల్లీ. నివేదిక ప్రకారం 2021లో మొదటి 5 స్థానాల్లో ఉన్న అత్యంత కాలుష్య దేశాలు వరుసగా బంగ్లాదేశ్, చాద్, పాకిస్థాన్, తజికిస్థాన్, భారత్ కాగా… ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లోని 6475 నగరాలు, పట్టణాల్లో ఈ సంస్థ వాయునాణ్యతను పరిశీలించింది.
వాయునాణ్యత బాగాపడిపోయి కాలుష్య కాసారాలుగా మారిన టాప్-100 ప్రాంతాల్లో 63 భారతీయ నగరాలు, పట్టణాలు ఉన్నాయి. ఆ 63 నగరాల్లో సగాని కన్నా ఎక్కువ హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనివే. వాటిలో టాప్-3లో ఉన్న నగరాలు భివాడీ(రాజస్థాన్), ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్), ఢిల్లీ.
ఇక ఈ జాబితాలో తెలుగు రాష్ట్ట్రాల నగరాలు 5 ఉన్నాయి. ఏపీలోని విశాఖపట్నం అగ్రస్థానంలో.. మొత్తం 6475 నగరాల జాబితాలో 155వ స్థానంలో నిలవగా… తెలంగాణలోని హైదరాబాద్ 39.4 సగటుతో 232వ స్థానంలో నిలిచింది. కాలుష్య రాజధానుల్లో మొదటనిలిచిన నగరం హైదరాబాద్.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, రాజమండ్రికి సమీపంలోని తోగుమ్మి 33.9 సగటుతో 354వ స్థానంలో నిలిచాయి. పంచారామ క్షేత్రం అమరావతి 29.5 వార్షిక సగటుతో 487వ స్థానంలో, తిరుపతి 28.8 వార్షిక సగటుతో 516వ స్థానంలో నిలిచాయి. దేశంలోని 6 మెట్రో నగరాల్లో చెన్నై మినహా మిగతా 5 నగరాల్లో వాయు కాలుష్య స్థాయులు 2020 కన్నా 2021లో పెరిగాయి.
గతేడాది గణాంకాలతో పోలిస్తే భారత్లోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత మరింత దిగజారగా, చైనాలో మాత్రం చాలా చోట్ల గతం కన్నా పరిస్థితి మెరుగైంది. కర్బన ఉద్గారాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలు, ఇతర పరిశ్రమల్లో కార్యకలాపాలు తగ్గించడమే కారణం. చైనా రాజధాని బీజింగ్లో వాయు నాణ్యత వరుసగా ఐదో ఏడాది మెరుగుపడింది.
ప్రపంచంలోని టాప్ -50 కలుషిత నగరాల్లో 46 మధ్య, దక్షిణాసియావే కావడం ఆందోళనకరం. అందులోనూ 11 నగరాలు భారత్ కు చెందినవే ఉన్నాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)