దిల్లీ అల్లర్లలో దిల్బర్ నేగీ అనే 22 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేసిన నిందితులకు డిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉద్యోగం వెదుక్కుంటూ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆర్నెళ్లకే అతన్ని దుండగులు హత్య చేశారు. ఓ స్వీట్ షాపులో పనికి కుదిరి అప్పుడప్పుడే కుదురుకుంటున్న దిల్బర్ కాళ్లు చేతులు నరికి చంపారు దుర్మార్గులు.
2020 ఫిబ్రవరి నాటి డిల్లీ అల్లర్లకు సంబంధించి గోకుల్ పురి హత్య కేసులో నిందితులు మహ్మద్ తాహిర్, షారుక్, మహ్మద్ ఫైజల్, మహ్మద్ షోయబ్, రషీద్ , పర్వేజ్ అనే ఆరుగురికి ఢిల్లీ హైకోర్టు జనవరి 18న బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆరుగురూ అనిల్ స్వీట్ కార్నర్ కు నిప్పంటించారని..ఆ సమయంలో అందులోనే ఉన్న దిల్బర్ నేగి మరణించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు తీర్పును ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాది అమిత్ మహాజన్ తీవ్రంగా వ్యతిరేకించారు. అల్లరి మూకలు దిల్బర్ నేగీ చేతులు మరియు కాళ్లను నరికేశారని ఆయన అంటున్నారు.
ఇక పోలీసుల కథనం ప్రకారం, ఫిబ్రవరి 24న శివ విహార్ తిరహా సమీపంలో ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. అక్కడున్న దుకాణాలకు నిప్పుపెట్టారు. అల్లర్లు జరిగిన రెండు రోజుల తర్వాత అక్కడి స్వీట్ కార్నర్లో చిద్రమైన, కాలిపోయిన మృతదేహం కనిపించింది. అది పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా ఉంది. తరువాత అతన్ని స్వీట్ షాప్ లో పనిచేసే 22 ఏళ్ల దిల్బర్ గా గుర్తించారు. సెక్షన్ 147, 148, 149 , 302, 201 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గోకుల్పురి పోలీస్ స్టేషన్లో నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని 436, 427 సెక్షన్ల కింద కేసు పెట్టారు.
అనంతరం ఈ కేసును క్రైం బ్రాంచ్కు చెందిన సిట్కి బదిలీ చేశారు. జూన్ 2020లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు పన్నెండు మందిని నిందితులుగా పేర్కొన్నాయి. అల్లర్లు రాళ్లు రువ్వారని, హిందూ వ్యతిరేక నినాదాలు చేశారని, పలు దుకాణాలు, ఇళ్లను తగులబెట్టారని ప్రజా ప్రత్యక్ష సాక్షులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆందోళన కారులు ఒక భవనంలోకి ప్రవేశించి, భవనంలో దాక్కున్న దిల్బర్ ను కాళ్లు చేతులు నరికి అనంతరం సజీవ దహనం చేసినట్టు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నిన్న నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.