తీవ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. మాలిక్ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాల్సిందిగా ఎన్ఐఏ అధికారులను ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్సింగ్ ఆదేశించారు. దాన్నిబట్టి జరిమానా మొత్తాన్ని నిర్ణయించి కోర్టుకు చెప్పాలని సూచించారు. ఇంతకుముందు అన్ లాఫుల్ యాక్టవిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (UAPA)సహా పలు అభియోగాల్లో నేరాన్ని అంగీకరించాడు మాలిక్.
సెక్షన్ 16 (ఉగ్రవాద చట్టం), 17 (ఉగ్రవాద చర్యకు నిధులు సేకరించడం), 18 (ఉగ్రవాద చర్యకు కుట్ర), UAPA చట్టం కింద 20 (ఉగ్రవాద చర్యకు కుట్ర), IPC లోని 120-B (నేరపూరిత కుట్ర) సహా 124-A (విద్రోహం) కేసులలో మాలిక్ గతంలో తప్పును అంగీకరించాడు.
ఫరూఖ్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే, షబ్బీర్ షా, మసరత్ ఆలం, ఎండీ యూసుఫ్ షా, అఫ్తాబ్ అహ్మద్ షా, అల్తాఫ్ అహ్మద్ షా, నయీం ఖాన్, ఎండీ అక్బర్ ఖండే, రాజా మెహ్రాజుద్దీన్ కల్వాల్, బషీర్ అహ్మద్ భట్, జహూర్ అహ్మద్ షా వతాలి, షబీర్ అహ్మద్ షా, అబ్దుల్ రషీద్ షేక్, నావల్ కిషోర్ కపూర్ సహా కాశ్మీరీ వేర్పాటువాద నేతలపై కూడా కోర్టు ఇంతకుముందు అధికారికంగా అభియోగాలను నమోదు చేసింది.
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్లపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, వీరిని ఈ కేసులో ప్రకటిత నేరస్థులుగా (PO) ప్రకటించారు.