1993 ముంబై పేలుళ్లలో దోషిగా తేలి ఉరిశిక్ష అనుభవించిన యాకూబ్ మెమన్ సమాధిని అలంకరించిన ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే విచారణకు ఆదేశించారు. యాకుబ్ సమాధి సుందరీకరణ పనులు జరుగుతున్నాయని మీడియాలో ప్రసారంకావడంతో ప్రభుత్వం స్పందించింది. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు సీఎం. ఓ దోషి సమాధిపై స్మారకచిహ్నం నిర్మించేందుకు ఇంతకుముందున్న మహావికాస్ అఘాడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని బీజేపీ మండిపడింది. ఇప్పుడు సమాధిని అలంకరించిన వారిపై కఠిన చర్యలుంటాయని షిండే అన్నారు. గ్రానైట్తో అందంగా పేర్చి విద్యుద్దీపాలు అమర్చారు. విమర్శల నేపథ్యంలో ముంబై పోలీసులు లైట్లు తొలగించారు.