దేశ రాజధాని పట్టపగలు కాల్పుల మోతతో దద్దరిల్లింది. అదీ కోర్టు ఆవరణలో. డిల్లీలోని రోహిణీ కోర్టు ఆవరణలో ఓ గ్యాంగ్ స్టర్ లక్ష్యంగా ప్రత్యర్థి గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ జితేందర్ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసుల కూడా కాల్పులు జరపడంతో ముగ్గురు దుండగులు హతమయ్యారు. మరోవ్యక్తి గాయపడ్డాడు. దిల్లీలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ జితేందర్ గోగి తిహార్ జైల్లో ఉన్నాడు. కేసు విచారణలో భాగంగా శుక్రవారం పోలీసులు అతన్ని రోహిణిలోని కోర్టుకు తరలించారు. అతన్ని తరలిస్తున్న సమయంలోనే లాయర్ వేషంలో వచ్చిన ముగ్గురు ప్రత్యర్థులు అతనిపై కాల్పులు జరిపారు. దుండగులు దాదాపు 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో జితేందర్ అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.