దారీ తెన్నూ లేని కారు ప్రయాణం!?
తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లకు ఏమీ అర్థమైత లేనట్టుంది. మైనారిటీల బుజ్జగింపు మీద నమ్మకం సడలిందో, హిందువుల ఐక్యత పెరగడంతో భయం మొదలైందో గానీ తడవకో విధంగా ప్రవర్తిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. కోరుట్ట ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విచిత్ర విన్యాసాలే దీనికి ఉదాహరణ. ఎక్కడో ఉత్తర్ ప్రదేశ్ లో రాముడి కడితే చందాలు ఇవ్వాలా? ఎవరూ ఇయ్యద్దు అని ఉచిత సలహా ఇచ్చిన మర్నాడే తన పొలిటికల్ టాలెంట్ రుజువు చేసుకున్నారు. హిందువులు బాధపడి ఉంటే సారీ అన్నారు. నరం లేని నాలుక ఎటైనా తిరుగుతదని మరొక్కసారి ఈయన రుజువు చేశారు. తనవంతుగా అయోధ్య రామాలయానికి 5 లక్షలో 10 లక్షలో ఇస్తారట.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో కెసిఆర్ బృందానికి దిక్కుతోచని స్థితి వచ్చింది. ముస్లింలను బుజ్జగించినంత కాలం ఎంఐఎం చెప్పు చేతల్లోఉండాల్సిందే. ఎందుకంటే పాతబస్తీలోని 50 సీట్లకు వాళ్లే పోటీ చేసి వీలైనన్ని గెలుస్తారు. మరోదిక్కు, బిజెపి బండి జోరు మీదుంది. జిహెల్ ఎం సి ఎన్నికల సమయంలోనే నమస్తే తెలంగాణలో పేజీల కొద్దీ కెసిఆర్ హిందూత్వం మీద ప్రత్యేక కథనాలను వండి వార్చారు. కానీ జనం నమ్మలేదు. తెలంగాణపై ముస్లింలకే మొదటి హక్కు ఉంటుందని హిందువులను బొందూగాళ్లని కించపరిచిన కెసిఆర్ నిఖార్సయిన హిందూత్వ వాది అని ప్రజలు నమ్మనే లేదు. కాబట్టే కారు షెడ్డుకుపోయినంత పనైంది. సెంచరీ స్థాయిలో సీట్లు గెలుద్దామంటే అర్ధ సెంచరీతోనే కారు ఆగిపోయంది. హిందూ ఓటు బ్యాంకు బలోపేతం అవుతోందని కెసిఆర్ కు ఆయన సుపుత్రుడికి కూడా అర్థమైందేమో. బహుశా అందుకే కావచ్చు కోరుట్ల ఎమ్మెల్యేకు తలంటి ఉంటారని పబ్లిక్ టాక్. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆయన సారీ చెప్పి చందా ఇస్తానని కమిటయ్యారనేది సోషల్ మీడియా సమాచారం. ఇకమీదట ఏ ఎన్నికలు వచ్చినా అటు మైనారిటీలను దువ్వడంతో పాటు హిందూత్వాన్ని కూడా భుజాలకెత్తుకునే ప్రయత్నాన్ని తెరాస నేతలు చేస్తారేమో. స్ఙిరంగా, స్పష్టంగా ఒక వైఖరికి కట్టుబడి ఉండే చాన్స్ లేనట్టుంది. అందుకే ఒక దిశ, దారి లేకుండా గులాబీ కారు ప్రయాణం చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.