కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన నెలకొంది. గత వారం రోజులుగా నిత్యం లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. అంతేకాదు రికవరీ రేటు కూడా అత్యల్పంగా ఉండటంతో టెన్షన్ నెలకొంది. మరోవైపు కరోనా బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1,68,912 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అంతేకాదు.. కరోనా మహమ్మారి బారినపడి 904 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 1,70,179కు చేరింది.
కాగా, కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 10.45 కోట్ల మందికి కరోనా టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.